18 కేసుల్లో చంద్రబాబు స్టే: 'ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టు అడ్డుకోలేదు'
అమరావతి: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టు అడ్డుకోలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్పై విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ కోర్టు జారీచేసిన మెమోపై మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చిందని అన్నారు.
అడ్డంగా బుక్కయ్యారు: 'కేసు నుంచి బయటపడేందుకే సుజనాను ఢిల్లీకి పంపారు'
అంతేతప్ప క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే ఇవ్వలేదని, అందువల్ల తెలంగాణ ఏసీబీ తన కేసు విచారణను కొనసాగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కేసు పెండింగ్ లోనే ఉంటుందని, కేసు విచారణకు ఎలాటి ఆటంకాలు కలగించలేదని మరో సీనియర్ న్యాయవాది అరుణ్కుమార్ పేర్కొన్నారు.
హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై పునర్విచారణ చేపట్టి ఈనెల 29లోపు సమగ్ర నివేదిక అందజేయాలని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఆయనకు ఊరట లభించింది.
ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై 8వారాలపాటు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. వివరంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. క్వాష్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ దారు తరుపు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలతో ఏకీ భవించలేదు.
దీంతో ఏసీబీ కేసుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు సార్లు స్టే తెచ్చుకున్నట్లుగా తేలింది. 2003లో ఓ కేసుతో పాటు తాజాగా ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకున్నారు. సీబీఐ విచారణతో పాటు ఏ ఒక్క కేసులో కూడా పూర్తిగా విచారణ జరగక్కుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళతామని మంగళగిరి వైసీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసు దాఖలు చేసేటప్పుడే తాము చంద్రబాబును స్టేకు వెళ్లొద్దని చెప్పామని అన్నారు.
ఓటుకు నోటు కేసు: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
అయితే కేసులో దోషిగా తేలితే తన భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారని అన్నారు. అసలు ఏసీబీని ఆశ్రయించడానికి తనకు అర్హత లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది అన్నారని, కానీ న్యాయస్థానం మాత్రం తనను అనర్హుడిగా ప్రకటించలేదని, కేసు నుంచి బయటపడలేదని అన్నారు.
కేవలం ఏసీబీ కోర్టు మెమోపై 8 వారాలు మాత్రమే స్టే ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ స్టే వెకేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. తాము సమర్పించిన సాక్ష్యాలు సరైనవేనని భావించడం వల్లే ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని కేసు పునర్విచారణకు ఆదేశించిందని అన్నారు.