అక్కడ దాచాడు: బ్యాగు నిండా ఆ డాక్యుమెంట్సే, రఘు అవినీతిలో కొత్త కోణాలు..
విజయవాడ డీఎన్ఆర్ షాపింగ్ మాల్ అధినేత సుబ్బారావుకు, తన బినామీలైన శివప్రసాద్, అతని భార్య గాయిత్రీదేవి ద్వారా రఘు తన డబ్బుని అప్పుగా ఇచ్చేవాడు.
విజయవాడ: పోలీసుల కస్టడీలో ఉన్న రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘు నుంచి పోలీసులు ఆసక్తికర విషయాలు రాబట్టారు. దీంతో అతని అవినీతి, అక్రమాల్లో పలు కొత్త కోణాలు వెలుగుచూశాయి.
బైర్లు కమ్మే ఆస్తులు: రఘు అక్రమాల్లో ఐఏఎస్ కుమార్తె?, సంచలనమే!..
సోమవారం ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.కిందిస్థాయి ఉద్యోగులు, నమ్మిన బంటుల్లా వ్యవహరించిన కొంతమంది ప్రైవేటు వ్యక్తుల సహాయంతోనే రఘు తన అక్రమాలను చక్కబెట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
బద్దలైన అవినీతి పుట్ట: ఏసీబీ చరిత్రలోనే భారీ అవినీతి 'పాము'.. (ఫోటోలు)!
మనీ లాండరింగ్తో పదింతలు:
తనకు నమ్మకస్తులుగా ఉన్నవాళ్లను ఏజెంట్లుగా పెట్టుకుని రఘు తన అక్రమాలు కొనసాగించాడు. నిబంధనలకు విరుద్దంగా వెంచర్లకు, భవనాలకు అనుమతులు ఇచ్చేందుకు.. వాళ్లు తీసుకొచ్చే పార్టీలతో బేరాలు కుదుర్చుకునేవాడు. తన వాటా ముందుగానే రాబట్టుకుని, అలా జమయిన డబ్బును మనీ లాండరింగ్ పద్దతుల్లో అంతకు పదింతలుగా మార్చుకున్నాడు.
అక్కడ దాచాడు:
అక్రమంగా పోగేసిన నల్లధనాన్ని రఘు తన బినామీ కంపెనీల్లోకి మళ్లించేవాడు. ఆస్తుల పత్రాలను మాత్రం తన వద్దే ఉంచుకునేవాడు. ఇటీవల ఏసీబీ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రఘు అప్రమత్తమయ్యాడు. తన వద్ద ఉన్న ఆస్తుల పత్రాలన్నింటిని వేరే వాళ్ల వద్దకు తరలించాడు.
12ఏళ్ల క్రితం తన వద్ద పనిచేసిన టి.మోహన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో డాక్యుమెంట్స్ దాచేశాడు. మోహన్ కుమార్ గతంలో అప్పటి విజయవాడ మేయర్ అనురాధకు పీఏగా పనిచేశాడు. తాజా దాడుల్లో మోహన్ కుమార్ ఇంటి నుంచి ఆ బ్యాగును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మనీ లాండరింగ్ కు సంబంధించిన లింకు డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి.
అనుమానం రావొద్దని:
అక్రమంగా కోట్ల కొద్ది వెనుకేసుకున్న అవినీతి సొమ్ముతో ఆస్తులను కొనుగోలు చేస్తే దొరికిపోతానని రఘు భయపడ్డాడు. అలా అయితే అనుమానం వస్తుందని, మనీ లాండరింగ్ పద్దతిలో నల్లధనాన్ని వైట్గా మార్చాడు. విజయవాడ డీఎన్ఆర్ షాపింగ్ మాల్ అధినేత సుబ్బారావుకు, తన బినామీలైన శివప్రసాద్, అతని భార్య గాయిత్రీదేవి ద్వారా రఘు తన డబ్బుని అప్పుగా ఇచ్చేవాడు.
ఎలాగూ తానే టౌన్&కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ కావడంతో సుబ్బారావు షాపింగ్మాల్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులను క్లియర్ చేయించేశాడు. క్రమంగా సుబ్బారావు మాల్ ను రఘు సొంతం చేసుకొన్నాడు. మాల్లో పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేసి బిల్లులు తన వద్ద ఉంచుకుని, ఆభరణాలను గాయత్రీదేవి ఇంట్లో భద్రపరిచాడు.
మోడీ ఎఫెక్ట్:
నోట్ల రద్దు ఎఫెక్ట్ తో తన వద్ద పోగుబడిన డబ్బును ఏం చేయాలో రఘుకు పాలుపోలేదు. దీంతో పెద్ద ఎత్తున బంగారం కొనాలని నిర్ణయించుకున్నాడు. అక్రమంగా సంపాదించినంత డబ్బుతో కిలోల కొద్ది బంగారం కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఏడాది కాలం నుంచి అదే పనిలో ఉన్నాడు. రఘుకు ఈనెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కేసు ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలాఉండగా, శివప్రసాద్, గాయత్రీదేవిలను మంగళ, బుధవారం విచారించనున్నారు.
అవినీతి పాము బంధువు అరెస్ట్:
గత జూన్ లో పట్టుబడ్డ మరో అవినీతి పాము పాండురంగరావు బినామీలపై పోలీసులు ఫోకస్ చేశారు. తాజాగా అతని బావమరిది డాక్టర్ నట్టా కృష్ణమూర్తి (58)ని ఏసిబి అధికారులు సోమవారం విజయవాడలో అరెస్టు చేశారు.
దాదాపు 900కోట్ల అక్రమ సంపాదనతో పాండురంగారావు ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి పాముగా వార్తల్లోకి ఎక్కాడు. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరిగ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్గా అంతూ పొంతూ లేకుండా అవినీతికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ఏసీబీకి పట్టుబడటంతో సస్పెన్షన్ తప్పలేదు.
కృష్ణమూర్తి కీలక పాత్ర:
నిందితుడు కృష్ణమూర్తి తన బావ పాండురంగారావు అవినీతి వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. కృష్ణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో బేబి చిల్డ్రన్ హాస్పిటల్స్ నడుపుతున్నట్లు గుర్తించారు.
పాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును కృష్ణమూర్తి పేరుతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. కృష్ణమూర్తి తల్లిదండ్రులు బేబి నాంచారమ్మ, ఎన్ రాజేశ్వరరావు పేర్లతో ఉన్న బ్యాంకు అకౌంట్లలో కూడా పాము పాండురంగారావు సంపాదించిన అక్రమ డబ్బు నిల్వలను అధికారులు గుర్తించారు.
ఇదీ ఆస్తుల చిట్టా:
పాము పాండురంగారావుకు బినామీగా కృష్ణమూర్తి పేరిట కృష్ణాజిల్లా గంపలగూడెం, విశాఖపట్నం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పటాన్చెరు, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, విజయవాడ గుణదల, లబ్బీపేట, మైలవరం తదితర చోట్ల బినామీగా 11 ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించారు.
అలాగే 23.43 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫ్లాటు, ఒక ఇల్లు, మరొక జి ప్లస్2 భవనం గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలు రూ. 87లక్షల పైమాటే. మార్కెట్ విలువ ప్రకారమైతే కోట్లు ఉంటుందని అంచనా.