ఏసిబికి పట్టుబడిన మరో భారీ అవినీతి తిమింగలం...ఇలా ఎసిబికి దొరకడం రెండోసారి
విశాఖపట్నం:విశాఖలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. రవాణా శాఖలో సహాయ మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు(ఏఎంవీఐ) గా పనిచేస్తున్న శరగడం వెంకటరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఎసిబికి దొరికిపోయారు.
ఆయన ఇలా ఎసిబికి దొరకడం రెండోసారి కావడం గమనార్హం. తొలిసారి 2003లో ఎసిబి సోదాల్లో ఆయన పట్టుబడగా అక్రమార్జనకు సంబంధించి ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ కేసు ఉందనే ఈయనకి ప్రమోషన్ సైతం ఆపేశారు. అయితే అలా జరిగిందనే కసో లేఖ ఆల్రెడీ కేసుంటే మళ్లీ ఇంకేం చేస్తారులే అనుకున్నారో గాని రెచ్చిపోయి అక్రమాస్తులు కూడగడుతూనే ఉన్నారట. ఈయన గారి వ్యవహారపై పక్కా సమాచారంతో రెండోసారి దాడి చేసిన ఎసిబి పెద్దఎత్తున అక్రమాస్తులు గుర్తించింది.
తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో విశాఖ ఏఎంవీఐ వెంకటరావుతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు చెందిన టీమ్ లు జిల్లాలోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లను గుర్తించాయి. వీటి బుక్ వ్యాల్యూ సుమారు రూ.5కోట్లు కాగా మార్కెట్ వ్యాల్యూ రూ.50 కోట్లు పైనే ఉండొచ్చంటున్నారు.
వెంకటరావు స్వస్థలం విశాఖ జిల్లా సబ్బవరం మండలం పెదయాతపాలెం గ్రామం కాగా ఈయన 1994లో రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. అయితే లంచాలు ముక్కుపిండి వసూలు చేస్తారనే గుర్తింపు పొందిన వెంకటరావు పై 2003 లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి... రూ 1.8 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే ఆ తరువాత ఎలాగో మళ్లీ డ్యూటీలో జాయిన్ అయిన వెంకటరావు లంచాల వసూళ్ల జోరును మరింత పెంచినట్లు ఆ శాఖ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం విశాఖలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో ఏఎంవీఐగా పని చేస్తున్న వెంకటరావుపై అక్రమార్జనకు సంబంధించి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు. మురళీనగర్లో వెంకటరావు ఇంటితో పాటు ఆయన డైరెక్టర్గా ఉన్న అక్కయ్యపాలెంలోని శ్రీగౌరీ కోఆపరేటివ్ సొసైటీలో, గాజువాక, అక్కయ్యపాలెం, ఆరిపాక, అడ్డూరు, విజయరామరాజుపేటల్లోని సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్టు నిర్ధారణ కావడంతో వెంకటరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వెంకటరావు పేరిట సబ్బవరం మండలం గోపాలపురంలో 311.11చదరపు గజాల స్థలంలో భవనం...భార్య వెంకట పద్మ పేరిట బంగారమ్మపాలెంలో 66సెంట్లు... సబ్బవరం మండలం ఆరిపాకలో 2.5ఎకరాల భూమి...కుమారుడు ప్రవీణ్కుమార్ పేరిట బంగారమ్మపాలెంలో 93సెంట్ల భూమి. మరో కుమారుడు ప్రసన్నకుమార్ పేరిట సబ్బవరం మండలం ఆరిపాకలో 20సెంట్ల భూమి...కూతురు రితిక పేరు మీద ఆరిపాకలో 95సెంట్ల భూమితో పాటు నిర్మాణంలో జీ+2 భవనం. తల్లి వెంకాయమ్మ పేరిట ఆరిపాకలో 81సెంట్ల భూమితో పాటు 1,000చదరపు అడుగుల్లో నిర్మాణంలో ఉన్న జీ+1 భవనం...అత్త శిలపరశెట్టి పార్వతి పేరిట గోపాలపురంలో 220 చదరపు అడుగుల ఇంటిస్థలం...నిర్మాణంలో ఉన్న జీ+2 భవనం... అక్క కల్ల రమణమ్మ పేరిట సబ్బవరం మండలం గొట్వాడలో 3ఇళ్ల స్థలాలు, గోపాలపురంలో 220 చదరపు అడుగుల స్థలం
ఇవి కాకుండా రూ.70,000నగదు, రూ.25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.8లక్షల విలువైన గృహోపకరణాలు, 500 గ్రాముల బంగారం, 3కిలోల వెండి, మూడు కార్లు హ్యుండాయ్ ఐ20, మహీంద్ర ఎక్స్యూవీ, స్కోడా, 2 మోటార్ బైక్లు...రాయల్ ఎన్ఫీల్డ్, సుజుకీ యాక్సెస్, 5బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిలో మహారాష్ట్ర బ్యాంకులో 2, శ్రీగౌరీ కోఆపరేటివ్ సొసైటీ, విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు, ఎస్బీఐ ఊర్వశి బ్రాంచిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వాటిని తెరవాల్సి ఉందని ఎసిబి అధికారులు చెప్పారు. 2003నాటి సోదాల సమయంలో వెంకటరావు పేరిట మురళీనగర్లో ఖాళీ స్థలాన్ని గుర్తించగా ఇప్పుడు అక్కడ ఖరీదైన,విలాసవంతమైన రెండంతస్తుల భవనాన్ని నిర్మించి ఉండటం గమనార్హం.