ఎపిలో ఎసిబి జోరు:రెడ్ హ్యండెడ్ గా ఒకే రోజు...ముగ్గురు ట్రాప్
విజయవాడ, విజయనగరం: ఎపిలో ఎసిబి అధికారుల హవా కొనసాగుతోంది. గత కొంతకాలంగా అవినీతి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఎసిబి అధికారులు సోమవారం మరోసారి రాష్టంలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో కొరడా ఝళిపించారు. ఒకేరోజు ముగ్గురు అక్రమార్కులైన అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి ఆట కట్టించారు.
ఎపిలో ఎసిబి అధికారులు సోమవారం ఒక్క రోజే మూడు చోట్ల అవినీతి అధికారులను ట్రాప్ చేసి రికార్డు సృష్టించారు. అవినీతికి పాల్పడుతుండగా కృష్ణా జిల్లాలో ఇద్దర్ని, విజయనగరం జిల్లాలో ఒకర్నిఎసిబి అధికారులు రెడ్ హేండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు. వీరి ముగ్గురిలో ఒకరు మహిళా అధికారి కావడం విశేషం. వీరికి ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది.
కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలో మాతంగి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి హౌసింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ లంకా సీతారామాంజనేయ అప్పారావు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ విభాగంలో మాతంగి వెంకటేశ్వర్లు కు సంబంధించి రూ.1,12,000 పెండింగ్ బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేయగా, అతడు ఎసిబి ఫిర్యాదుకు చేయడంతో వారు లంచం తీసుకుంటున్న ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మరో ఘటనలో కృష్ణా జిల్లా వత్సవాయి మండలం, పొలంపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గురజాల కోటయ్య రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిపోయారు. పొలంపల్లి గ్రామానికి చెందిన పాము శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ప్రభుత్వ గృహ కేటాయింపు ధరఖాస్తును ప్రభుత్వానికి పంపడానికి గురజాల కోటయ్య లంచం అడిగినట్లు తెలుస్తోంది. దీంతో పాము శ్రీనివాసరావు ఎసిబికి ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు విజయవాడ రూరల్ నల్లకుంటలోని తన స్వగృహంలో కోటయ్య లంచం సొమ్ము తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించిన ఈ ఇద్దరు అవినీతి అధికారులకు విజయవాడలోని ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది.
మరో ఘటనలో విజయనగరం జిల్లా రాకోడు గ్రామ విఆర్ఒ షేక్ సలీమా అదే గ్రామానికి చెందిన డి.శ్రీను అనే రైతుకు చెందిన నాలుగున్నర ఎకరాల భూమికి పట్టాదారుపాస్ పుస్తకాలు ఇవ్వడానికి గాను రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ ప్రకారం రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. నిందితురాలైన మహిళా విఆర్వోని ఎసిబి అధికారులు అరెస్ట్ చేసి విశాఖపట్నం ఎసిబి కోర్టులో హాజరు పరిచారు.