జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయి ..బొత్సా వ్యాఖ్యలకు విలువ లేదన్న అచ్చెన్నాయుడు
ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఏపీలో పెను దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు చెయ్యటమే కాకుండా తాజాగా ఆయన తానూ చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఉత్తరాంధ్ర నేత అచ్చెన్నాయుడు జగన్ పాలనపై, బొత్సా వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.
మంత్రి బొత్స వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం అచ్చెన్నాయుడు
శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు , మంత్రి బొత్స వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం మొత్తం జగన్ కనుసన్నల్లో నడుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆయన పేర్కొన్నారు. రాజధాని విషయంలో జగన్ ఏం అనుకుంటారో అదే చేస్తారని చెప్పిన అచ్చెన్నాయుడు రాజధాని మార్చడమనేది అంత సులువు కాదన్నారు . రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే పట్టణం రాజధాని అనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని రాజధానంటే 4 భవనాలు కాదని ఆయన హితవు పలికారు.
మైకుల్లో మాట్లాడడం తప్ప బొత్సా ఏమీ చేయలేడని ఎద్దేవా చేసిన అచ్చెన్న
ఇక రాజధాని విషయంలో తలాతోకా లేకుండా మాట్లాడిన మంత్రి బొత్స మాటలకు విలువ లేదని ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. బొత్స మైకుల్లో మాట్లాడడం తప్ప ఏమీ చేయలేడని ఆయన ఎద్దేవా చేశారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో పెట్టినప్పుడు అందరూ చప్పట్లు కొట్టినవారేనని అచ్చెన్న గుర్తుచేశారు. ఇప్పుడు శివరామకృష్ణ కమిటీని తప్పు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక తాము ఇంత తొందరగా రోడ్డెక్కాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పిన అచ్చెన్నాయుడు ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
వైసీపీకి ఆర్నెల్ల సమయం ఇస్తే ఏమీ మిగలదన్న అచ్చెన్నాయుడు
వైసీపీకి ఆర్నెల్ల సమయం ఇద్దామని మొదట అనుకున్నామని కానీ ఇప్పుడు ఆర్నెల్ల సమయం ఇస్తే ఏమీ మిగలదని అర్థమైందని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు అచ్చెన్న . పోలవరంపై జగన్ పంతానికి పోతున్నారని, కానీ పోలవరం పరిస్థితి పట్ల సీఎం జగన్ అవగాహన చేసుకోవాలని హితవు పలికారు. అమరావతిని మార్చాలన్న, ఉంచాలన్నా, చంపేయాలన్నా అంతా జగన్ చేతిలోనే ఉందన్న అచెన్న పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది జగన్ పాలన అని అభిప్రాయపడ్డారు. జగన్ ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలాగే వేధిస్తే, రాష్ట్రంలో ఒక్క వైసీపీ కార్యకర్త అయినా మిగిలేవారా అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.మొత్తానికి జగన్ సర్కార్ ను, సీఎం జగన్ ను , మంత్రి బొత్సాను టార్గెట్ చేసి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.