ఎపి ఉద్యోగులను వెళ్లిపోమంటారా: రాజీవ్ శర్మపై అచ్చెన్నాయుడు ఫైర్
హైదరాబాద్: విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన హైదరాబాదులోని సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పిన మాటలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని అని, దానిపై ఒక్క నిమిషం కూడా హక్కు వదులుకోబోమని ఆయన అన్నారు. దానిపై, సెక్షన్ 8 అమలుపై గవర్నర్ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో జరుగుతున్న ప్రాథమిక రంగాల విస్తృత స్థాయి సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
షెడ్యూల్ 9, 10 గురించి తెలంగాణ రాజీవ్ శర్మ వక్రీకరించి తీవ్రంగా మాట్లాడుతున్నారని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. సెక్షన్ 10 ప్రకారం హైదరాబాద్పై తెలంగాణతో సమానంగా ఏపీకి కూడా హక్కు ఉందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో 103 ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేసుకున్నామని, వీటిలో ఏపీకీ వాటా ఉంటుందని, అక్కడ పని చేస్తున్న ఏపీ ఉద్యోగులను వెళ్లిపోవాలనడం సరికాదని, వారక్కడే పని చేస్తారని ఆయన వాదించారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులు చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం లేదని, ఈ విషయంపై ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించాలని అన్నారు. సెక్షన్- 8 అమలుపై సుప్రీం కోర్టుకు వెళతామని, అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు.