జగన్ వల్లే రాష్ట్రానికి అథోగతి.. చర్చకు నేనొస్తా..సిద్దమా?: అచ్చెన్న సవాల్
విశాఖలో జగన్ విధ్వంసానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
అమరావతి: వైసీపీ అధినేత జగన్ తీరుపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. హోదా దీక్ష పేరిట విశాఖలో జగన్ విధ్వంసానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడుగడుగునా అడ్డు పడుతున్న జగన్.. విశాఖలో జరగనున్న పారిశ్రామిక సదస్సుకు అడ్డుపడాలని చూస్తున్నారని మండిపడ్డారు. హోదా పేరుతో ఆందోళన కార్యక్రమాలు జరపవద్దని సూచించారు. హోదా లేకపోయినా.. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను చంద్రబాబు తీసుకువస్తున్నారని అన్నారు.
ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలనేదే తమ డిమాండ్ అని అచ్చెన్న స్పష్టం చేశారు. జగన్ మిలాఖత్ రాజకీయాల వల్ల ఏపీ అడుక్కునే స్థితికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీపై ప్రభుత్వ ప్రతినిధిగా తాను బహిరంగ చర్చకు సిద్దమన్నారు. చర్చకు నేను వస్తా.. జగన్ సిద్దమా?.. అంటూ సవాల్ విసిరారు.