ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి జయరాం
Recommended Video
ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు హయాంలో భారీ ఈఎస్ఐ కుంభకోణం జరిగిందన్నారు. స్కామ్లో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. స్కామ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ డైరెక్టర్లకు రాసిన లేఖ ఆయన అవినీతికి సాక్ష్యం అన్నారు.
దాని ఆధారంగా అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవ ధరలకు విరుద్దంగా అధిక ధరలు చెల్లించి మెడిసిన్స్,మెడికల్ వస్తువులు కొనుగోలు చేశారని.. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని మంత్రి తెలిపారు. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేశారని, మందుల ధరలను భారీగా పెంచి దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈఎస్ఐ స్కామ్లో తనపై వస్తున్న ఆరోపణలను అచ్చెన్నాయుడు ఖండించారు. ప్రధాని ఆదేశాల ప్రకారమే పనులు నిర్వహించామని,నామినేషన్ పద్దతిలో వర్క్ ఆర్డర్ల ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో అమలుచేస్తున్న విధానాన్నే ఏపీలో తాము అమలుచేశామని చెప్పారు. అప్పట్లో తాను రాసిన లేఖలోనూ అదే విషయం పేర్కొన్నట్టు తెలిపారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని,విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్దమని తెలిపారు. ఆనాటి రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని.. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పారు.