జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటన వివరాల్లోకి వెళితే గోకవరం నుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపుతప్పి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మల్లిసాల వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో విద్యుత్ స్తంభాన్ని కారు వేగంగా డీ కొట్టింది . కారు ఢీకొన్న దాటికి విద్యుత్ స్తంభం కారు పై పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విశాఖకు చెందిన వారిగా గుర్తించారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ బుక్కా వీధికి చెందిన హనుమంతరావు, దేవీపట్నం మండలం ఫజిల్లాబాద్ కు చెందిన సతీష్ గా గుర్తించారు.
విద్యుత్ స్తంభం కారుపై పడి మంటలు చెలరేగడంతో హనుమంతరావు, సతీష్ ఇద్దరూ మంటల్లో సజీవదహనమయ్యారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో వారిని కాపాడే వీలు లేకుండా పోయింది . ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న మరో ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. కారులో ఉన్న రమాదేవి, భాను, ఆదిత్య కుమార్ అనే ముగ్గురు గాయాలతో బయటపడగా వారిని జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా తగలబడిపోయింది . అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.