షాకింగ్.. 5 క్షణాల్లోనే పిల్లర్ వద్దకు మంత్రి నారాయణ కొడుకు: యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ ముందు వెళ్తున్న కార్లను దాటేందుకు ప్రయత్నించడంతో మెట్రో పిల్లర్ వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ ముందు వెళ్తున్న కార్లను దాటేందుకు ప్రయత్నించడంతో మెట్రో పిల్లర్ వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యక్షసాక్షులు, సీసీకెమెరా ఫుటేజీలుండటంతో ఈ నిర్ణయానికి వచ్చారు.
ఆ కారుపై పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే..
మెట్రో పిల్లర్ 9 వద్ద రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నిషిత్ కారు మెట్రో పిల్లర్ల వైపు ఎలా వెళ్లింది? ఆరా తీశారు. మూడు పిల్లర్ల వరకూ తిరిగి అధికారులు పరిశీలించి, ఆధారాలు సేకరించారు.
5 సెకన్లలో వచ్చాడు
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కారులో వేగంగా వస్తున్న నిషిత్ క్షణాల వ్యవధిలోనే మెట్రో పిల్లర్ 9ను బలంగా ఢీకొట్టాడని గుర్తించారు. కారు వేగం, ప్రమాదం జరిగిన తీరును చూస్తే చెక్ పోస్ట్ నుంచి అయిదు సెకెన్లలోపే మెట్రో పిల్లర్9 వరకూ వచ్చాడని గుర్తించారు.
వాహనాలను దాటేందుకు..
నిషిత్ తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై ఎడమవైపు వెళ్లడమే అనుకూలమని, అయితే వాహనాలను దాటేసి వెళ్లేందుకు పూర్తిగా కుడివైపు వాహనాన్ని తిప్పడం, గంటకు 205 కి.మీ. వేగం ఉండటం ప్రమాదానికి ప్రాథమిక కారణాలన్నారు. ఈ వేగం వల్లే మెట్రో పిల్లర్ రక్షణగోడ స్వల్పంగా బీటలు వారిందన్నారు.
హెచ్చరిక బోర్డులు
మెట్రో పిల్లర్ నంబరు 7, 8, 9 నుంచి 17వరకూ యాక్సిడెండ్ ప్రోన్ జోన్గా ప్రకటించారు. వీటి వద్ద ప్రమాద హెచ్చరికలు, వేగపరిమితులు ఏర్పాటు చేస్తారు. ప్రతి పిల్లర్ వద్ద రేడియం స్టిక్కర్లతో పాటు బోర్డులను ఉంచనున్నారు.
పరిమిత వేగం
గంటకు 40 కి.మీ. వేగంతోనే వెళ్లాలని పరిమితులు విధించారు. ఈ ఆంక్షలు ఈ రోజు (శుక్రవారం) నుంచి అమలులోకి వస్తున్నాయి.
రెండు చోట్ల ప్రమాదకర మలుపులు
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పెద్దమ్మ గుడి వరకూ రెండు చోట్ల ప్రమాదకరమైన మలుపులున్నాయి. మెట్రో పిల్లర్ 6 నుంచి పెద్దమ్మ గుడి దాటిన తర్వాత చౌరస్తా వరకూ రహదారిలో ఇవి ఉన్నాయి. రెండుచోట్ల జెడ్ ఆకారంలో రోడ్డు ఉండటం, మెట్రో పిల్లర్లు వరుసగా కాకుండా రైలు వెళ్లేందుకు వీలుగా మెలికలు తిరిగి ఉండటం, ఒకటి ముందుకు, మరొకటి వెనుక నిర్మించడంతో అందరు.. ముఖ్యంగా రాత్రివేళల్లో వేగంగా వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. మలుపుల వద్ద సూచికలుంటే ప్రమాదాలు తగ్గే అవకాశముంది.
స్టీరింగ్ పైకి వెళ్లింది
ప్రమాదంలో నిషిత్ కారు ఇంజిన్ 80 శాతం లోపలికి వెళ్లిందని అధికారులు గుర్తించారు. స్టీరింగ్ పూర్తిగా పైకి వెళ్లింది. వేగం కారణంగా టైరు పేలింది. డాష్బోర్డులో గాలిసంచి విచ్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.