దొంగతనం నింద:మనస్థాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
నెల్లూరు: దొంగతనం నింద మోపడంతో మనస్థాపానికి గురైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీర్ అవుతుందని ఎంతో ఆశతో కుమార్తెను చదివిస్తుంటే విగతజీవిగా మార్చి పంపారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...
మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం...శ్రీకాళహస్తి మండలం వేలవేడు పంచాయతీ మాదమాల గ్రామానికి చెందిన అక్కుపల్లి బలరామయ్యకు ఏకైక కుమార్తె మాధవి(18) గూడూరు పట్టణంలోని ఆదిశంకర కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది. స్వస్థలం దూరం కావడంతో అదే కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది.
అయితే ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం హాస్టల్ లోకి సెల్ఫోన్ను అనుమతించేవారు కాదు. అయితే మాధవి స్నేహితురాలైన ఒక విద్యార్థిని కాలేజ్ నిర్వాహకులకు తెలియకుండా సెల్ఫోన్ వినియోగించేది. ఈ విద్యార్థిని కూడా మాధవితో పాటు హాస్టల్ గదిలోనే ఉండేది. రెండు రోజుల కిందట ఆ సెల్ఫోన్ను ఎవరో దొంగిలించారు. అయితే ఈ సెల్ఫోన్ పోగొట్టుకున్న విషయమై ఆ విద్యార్థిని ఫిర్యాదు మేరకు మాధవిని ప్రశ్నించారు. దీంతో మాధవి ఈ విషయమై తీవ్ర మనస్థాపానికి గురైంది. తనను దొంగలా చూడటం తట్టుకోలేని మాధవి సోమవారం తెల్లవారుఝామున హాస్టల్లోని బాత్రూమ్లో గోడకు ఉన్న రాడ్డుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం బాత్రూమ్లను శుభ్రపరించేందుకు వెళ్లిన సిబ్బంది కమ్మీకి విగతజీవిగా వేలాడుతున్నమాధవిని చూసి కాలేజ్ సిబ్బందికి తెలిపారు.
కళాశాలలోని బాలికల వసతి గృహంలో ఉంటున్న మాధవి ఆదివారం రాత్రి 10:30 వరకు మాధవి టీవీ చూస్తూ గడిపినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. ఆ తరువాత ఆమె ఎప్పుడు బాత్ రూమ్ కి వెళ్లిందో తాము గమనించలేదని చెబుతున్నట్లు తెలిసింది. దీంతో కాలేజ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు, చిల్లకూరు ఎస్ఐ శ్రీనివాసరావులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.