బాలిక హత్య, రేప్: కామాంధుడిని తొక్కి చంపారు
ఏలూరు: ముక్కు పచ్చలారని ఓ బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను చంపి శవాన్ని బీరువాలో దాచిపెట్టిన కామాంధుడు సురేష్ను ప్రజలు ఆగ్రహంతో తొక్కి చంపారు. పరారీలో ఉన్న సురేష్ ఏలూరు పాతబస్టాండులోని షాపుల వెనుక పడుకొని ఉండగా స్థానికులు అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రావడంతో పరారై రైల్వేఓవర్బ్రిడ్జీపైకెక్కాడు. పోలీసులు రావడం చూసి బ్రిడ్జీ పైనుంచి పట్టాలపైకి దూకాడు. అంతలో స్థానిక ప్రజలు ఆగ్రహంతో కామాంధుడిని తొక్కి చంపారు. ఈ సంఘటన ఏలూరులో సంచలనం సృష్టించింది.
బాలికను హత్య చేసి, శవాన్ని బీరువాలో దాచి పెట్టిన నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టిచ్చినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి, అతను పారిపోయాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లిలో చోటు చేసుకుంది.
బాలిక అంతకు ముందు రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. లావణ్య అనే ఈ బాలిక గురువారం బీరువాలో శవమై తేలింది. సురేష్ నేరాన్ని అంగీకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి.