బాలికపై రేప్, హత్య: సైకో ఆత్మహత్య, కన్నీటిపర్యంతమైన లేడీ డిఎస్పీ
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన సైకో సురేష్ను స్థానికులు చంపలేదని, అతడే ఆత్మహత్య చేసుకున్నాడని ఏలూరు డీఎస్పీ సరితాదేవి తెలిపారు. జిల్లాలోని ఏలూరు పట్టణం, మాదేపల్లిలో ఏడేళ్ల చిన్నారి లావణ్యపై అత్యాచారం చేసి, హత్య చేసిన సురేష్ను స్థానికులు చంపారన్న విషయంపై డీఎస్పీ వివరణ ఇచ్చారు.
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు సురేష్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె చెప్పారు. అతడు చనిపోయిన అనంతరం ఆగ్రహంతో ఉన్న స్థానికులు అతడి మృతదేహంపై దాడిచేశారని డీఎస్పీ చెప్పారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలో డీఎస్పీ సరితాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. అభం శుభం తెలియని చిన్నారిని అంతదారుణంగా చంపడం చాలా హేయమైన చర్య అన్నారు. తన సర్వీసులో ఇలాంటి ఘోరాన్ని చూడలేదన్నారు.
ముక్కు పచ్చలారని ఓ బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను చంపి శవాన్ని బీరువాలో దాచిపెట్టిన కామాంధుడు సురేష్ను ప్రజలు ఆగ్రహంతో హత్య చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సురేష్ ఏలూరు పాతబస్టాండులోని షాపుల వెనుక పడుకొని ఉండగా స్థానికులు అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
తొలుత వచ్చిన వార్తలు ఈ విధంగా ఉన్నాయి - అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రావడంతో పరారై రైల్వేఓవర్బ్రిడ్జీపైకెక్కాడు. పోలీసులు రావడం చూసి బ్రిడ్జీ పైనుంచి పట్టాలపైకి దూకాడు. అంతలో స్థానిక ప్రజలు ఆగ్రహంతో కామాంధుడిని తొక్కి చంపారు. ఈ సంఘటన ఏలూరులో సంచలనం సృష్టించింది. సురేష్ గతంలో కూడా పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.