నిందితుడి నుంచి ఎక్కువ కాల్స్ మహిళకే: ప్లాన్లో భాగంగా అతన్నేం చేస్తారు?.. విజయసాయి వీడియో పోస్ట్
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస రావు ఫోన్ కాల్స్ లిస్ట్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతని ఫోన్ నుంచి ఎక్కువగా ఓ మహిళకు కాల్స్ వెళ్లినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి సదరు మహిళని గుర్తించిన సిట్ దర్యాఫ్తు బృందం, కనిగిరిలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారని తెలుస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించారని సమాచారం. కాగా, ఏడాదిలో అతను 10వేలకు పైగా ఫోన్ కాల్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతని ఫోన్ కాల్స్ ఆధారంగా విచారిస్తున్నారు.
పథకంలో భాగంగా శ్రీనివాస్ను ఏం చేయబోతున్నారు?
శ్రీనివాసరావు పరిస్థితిపై వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్లో స్పందించారు. ముందుగా అనుకున్న పథకంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు శ్రీనివాసరావును ఏం చేయబోతున్నారోనని అనుమానం వ్యక్తం చేశారు. జగన్పై హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీతో సహా, టీడీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు చూస్తుంటే వారి కుట్ర ఆలోచనలు స్పష్టమవుతున్నాయన్నారు. చంద్రబాబు పిరికివాడే కానీ, హత్యా రాజకీయాలలో అనుభవజ్ఞుడన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఈ హేయమైన పిరికి చర్యకు పాల్పడ్డారన్నారు.
వీడియో పోస్ట్ చేసిన విజయసాయి
జగన్ పైన హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ను ఈరోజు (మంగళవారం) పోలీసులు కేజీహెచ్ తరలిస్తుండగా ప్రజలతో మాట్లాడే ఒక అవకాశం కల్పించండని, తనకు ప్రాణహాని ఉన్నదంటూ మీడియా ప్రతినిధులను వేడుకుంటున్న వీడియో అంటూ విజయసాయి రెడ్డి ఓ వీడియోను పోస్ట్ చేశారు.
కుట్రకు మరో కుట్ర
శ్రీనివాస్ను విశాఖపట్నం పోలీసులు రోజుల తరబడి విచారిస్తున్నా నోరు విప్పడం లేదని మీడియాకు లీకులు ఇస్తున్నారని, నిందితుడేమో ప్రజలతో మాట్లాడే ఒక అవకాశం కల్పించండని మీడియాను వేడుకుంటున్నాడని, కుట్రపై మరో కుట్రకు తెర తీస్తున్నారని మండిపడ్డారు.
శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు
అంతకుముందు శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ప్రాణ హాని ఉందని, ప్రజలతో ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పాడు. విశాఖ విమానాశ్రయం పోలీస్ స్టేషన్లో సిట్ విచారిస్తున్న సమయంలో తన చేతుల్లో, ఛాతిలో నొప్పి ఉందని శ్రీనివాస్ అధికారులకు చెప్పాడు. వైద్యం కోసం కేజీహెచ్కు తరలిస్తుండగా పైవిధంగా మాట్లాడాడు.