జగన్పై దాడి: రాత్రి వరకు విచారణ, శ్రీనివాస్కి 6రోజుల కస్టడీ, ‘చికెన్ బిర్యానీ తెప్పించుకుని..’
Recommended Video
అమరావతి/విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కోడి పందేల కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం సిట్, విశాఖ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కేసును వివిధ కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.
రాత్రి 10గంటల వరకు..
ఆదివారం ఉదయం 11.30 గంటలకు నిందితుడిని కేంద్ర కారాగారం నుంచి ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి సిట్ అధికారులు సుదీర్ఘంగా రాత్రి 10 గంటల వరకు విచారణ చేపట్టారు. ముఖ్యంగా నిందితుడు మాట్లాడిన ఫోన్కాల్స్ డేటాను సేకరించారు.
‘చంపాలనే దాడి, జగన్ తప్పించుకున్నారు': విమానాశ్రయంలో ఏం జరిగిందంటే..?
ఫోన్ కాల్స్ పరిశీలన..
గత కొంతకాలంగా అతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కువసార్లు ఎవరితో, ఏమి మాట్లాడాడు? అనే విషయాలను సేకరించారు. ఫోన్కాల్స్ ఆధారంగా జగన్పై దాడి చేస్తానని ఎవరితోనైనా చెప్పాడా, వాటికి సంబంధించి వాయిస్ రికార్డ్లను కూడా పరిశీలిస్తున్నారు.
లేఖ రాసిని వారినీ విచారించారు..
అంతేగాక, ఎక్కువ సార్లు మాట్లాడిన వారిని, బంధువులను స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారు. వీరితోపాటు లేఖలో 9పేజీలు రాసిన వరుసకు సోదరైన విజయదుర్గ, ఒక పేజీ రాసిన ఎయిర్పోర్టులో సెక్యూరిటీగా పనిచేస్తున్న రేవతీపతిని సిట్ అధికారులు రెండోరోజు కూడా ప్రశ్నించి..లేఖలో వారి దస్తూరిని పోల్చి చూశారు.
ఆరు రోజులపాటు కస్టడీకి శ్రీనివాస్
నిందితుడు శ్రీనివాసరావును పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు 6 రోజులపాటు కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్నారు. నవంబరు 2వ తేదీ వరకు విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలియజేశారు. నివేదికను కోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు.
బిర్యానీ కావాలంటూ శ్రీనివాస్..
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించిన సీపీ మహేష్ చంద్ర లడ్డా, డీసీపీ ఫకీరప్పలు భోజనానికి తమ క్యాంపు కార్యాలయాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం తింటావ్ అని నిందితుడు శ్రీనివాసరావును ప్రశ్నించగా.. బిర్యాని కావాలని అడిగాడని తెలిసింది. దీంతో స్టేషన్ సమీపంలో ఉన్న హోటల్ నుంచి చికెన్ బిర్యాని తీసుకురాగా దాన్ని పూర్తిగా తిన్నాడని చెబుతున్నారు.
హోటల్ యజమానితోపాటు పలువురి విచారణ
కాగా, విచారణ సమయంలో ఎక్కడా బెరుకు, భయం లేకుండా అడిగిన ప్రశ్నలకు తడుం కోకుండా సమాధానాలు చెబుతుండడంతో అధికారులు కూడా ఒకింత విస్మయానికి గురైనట్లు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం విచారణను వేగవంతం చేశారు. విమానాశ్రయంలోని హోటల్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ను కూడా విచారణకు పిలిపించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ సాగింది. హోటల్ యజమాని హర్షవర్ధన్తో సహా తొలి రోజు 12 మందిని విచారించారు. కాగా, సోమవారం నిందితుడు శ్రీనివాస్ కు సంబంధించిన ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతా ల పరిశీలన జరిపితే మరిన్ని వాస్తవాలు వె లుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.