ప్రతీకారంగానే మాజీ సర్పంచ్ అప్పన్న హత్య
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ సర్పంచ్, ఎంపిటిసి సభ్యుడు కోళ్ల అప్పన్న హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. నిందితులను కాశీబుగ్గ డి ఎస్ పి దేవప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా ముందు ఉంచారు. డి ఎస్ పి దేవ ప్రసాద్ వివరాలు అందించారు. 2013 నవంబర్ నెలలో హత్యకు గురైన కోళ్ల చంద్రరావు హత్య కేసులో ఉన్న వారిపై ప్రతీకారం తీర్చుకుని వారిని హత్య చేసేందుకు అప్పటి నుండి చంద్రరావు భార్య కోళ్ల పార్వతి, కుమారులు వసంత్, కామేశ్, జనార్ధనరావులు అవకాశం కోసం ఎదురుచూసారని అన్నారు.
అయితే పలుసార్లు హత్యకు ప్రయత్నించినప్పటికీ వారికి అవకాశం దొరకక పోవడంతో టెక్కలి మండాపొలం కాలనీలో ఒక భూ వివాదంపై శ్రీధర్మేస్ర్తీ, లీలావతి అనే వ్యక్తులు ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన అప్పన్నపై దాడికి దిగి దారుణంగా తలపై మారణాయుధాలతో మోది హత్య చేసారని తెలిపారు. అయితే అప్పన్నతో ఉన్న మేనళ్లుడు పీత రాముని కూడా హత్య చేయడానికి యత్నించగా భయంతో అతను స్థానికంగా ఉన్న ఇంటిలోకి వెళ్లి తల దాచుకోగా, ఆ ఇంటి తలుపులపై కత్తులతో దాడి చేసారని డి ఎస్ పి తెలిపారు.
అయితే హత్య చేసేందుకుగాను చంద్రరావు కుటుంబ సభ్యులు కైవాడ నవీన్, టెంక హరి, గణేశం శ్రావణ్, చికురిప్రకాశ్లతోపాట ఒడిశాకు చెందిన మరో నలుగురితో రెండు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, ఒక కారుతో మాస్క్లు, మారణాయుధాలతో వచ్చి హత్య చేసారన్నారు. అయితే తన తండ్రి హత్యకు ప్రతీకారంతో పాటు అనేక భూవివాదాలు ఈ హత్యకు కారణమన్నారు.
హత్య చేసిన అనంతరం వీరు గండాహతి, పూరీ ప్రాంతాలకు పారి పోయారని మళ్లీ టెక్కలి పరిసరాల్లోకి వచ్చినట్లు తెలుసుకున్న టెక్కలి, నౌపడ ఎస్ ఐలు నర్సింహమూర్తి, రాజేష్లు సొంటినూరు రాజేష్ క్వారీ వద్ద వీరిని అరెస్టు చేసినట్లు డి ఎస్ పి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం వీరిని నరసన్నపేట కోర్టుకు తరళించారు.