రిషితేశ్వరి ఆత్మహత్య కేసు: నిందితులకు కోర్టులో చుక్కెదురు
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు కోర్టులో చుక్కెదురైంది. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారంనాడు కొట్టేసింది.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఎ1గా సీనియర్ విద్యార్థిని హనీషా, ఎ2గా జయచరణ్, ఎ3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు చేర్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని అవమానవీయమైన సంఘటనల వల్లనే తీవ్ర అవమాన భారంతో రిషితేశ్వరి మరణించినట్లు ఎపి ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తేల్చింది.
రిషితేశ్వరి ఆత్మహత్యకు అర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ తన నివేదికలో తెలిపింది. ఆయన అండదండలతోనే విశ్వవిద్యాలయంలో అరాచకాలు సాగుతున్నాయని కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తెలిపింది.
కాలేజీలోని అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మందు పార్టీలు చేసుకుంటున్నారని కమిటీ తేల్చింది. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా లేదని, ఆయన అండతోనే కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని చెప్పింది. రిషితేశ్వరిని లైంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ సహకారంతోనే జరిగాయని విచారణ కమిటి చెప్పింది.