ఎస్సై దురుసు ప్రవర్తన.. సోషల్ మీడియాలో వైరల్!
అమరావతి: ఈవ్ టీజింగ్కు పాల్పడ్డారనే ఆగ్రహంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట ఎస్సై ఏజీఎస్ మూర్తి పలువురు యువకులపై చేయి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సదరు యువకులపట్ల ఎస్సై దురుసుగా ప్రవర్తించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధిత యువకులు పోలీసులకు భయపడి నోరుమెదపకపోయినా బుధవారం పలు టీవీ చానళ్లలో కూడా ఈ దృశ్యాలు ప్రసారం కావడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... మహా శివరాత్రి సందర్భంగా ఆచంటలో తిరునాళ్లు జరుగుతున్నాయి.
స్థానిక కాపులపాలెంకు చెందిన బాలిక ఈ తిరునాళ్లకు రాగా సమీప గ్రామమైన శేషమ్మచెరువుకు చెందిన ముగ్గురు యువకులు ఆమె వెంట పడి వేధించారు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఆర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసి ఎస్సై మూర్తి నిందితులైన యువకులు ముగ్గురిని పాత పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ యువకులపై చేయి చేసుకోవడం అక్కడ గుమికూడిన వారిలో ఎవరో మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు.
ఆ తరువాత దానిని ఫేస్బుక్, వాట్సప్లలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. దీనిపై ఎస్సై ఏజీఎస్ మూర్తి మాట్లాడుతూ తాను వారిని కొట్టలేదని, ఈవ్ టీజింగ్ చేయడం తప్పంటూ మందలించానని చెప్పారు. సదరు వీడియోను ఎడిట్ చేసి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసులో బాధితులైన యువకులు కూడా పోలీసులకు జడిసి నోరు మెదపడం లేదు. బాధిత యువకులకు మద్దతుగా వచ్చిన పలువురు యువకులపై కూడా ఎస్సై దురుసుగానే ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.