Save Amaravati నిరసనల ఎఫెక్ట్: నలుగురు నాగార్జున వర్శిటీ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు..!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ చట్టానికి నిరసనగా అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తోన్న నిరసన దీక్షలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు విద్యార్థులపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు సస్పెండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించడం వల్లే వారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ నోటీసును జారీ చేశారు.
ఆశీర్వాదం నవీన్, రాజు, ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం చీఫ్ వార్డెన్ డాక్టర్ డీ రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నలుగురిలో ఏడుకొండలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ విద్యార్థి. మిగిలిన ముగ్గురూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు. యూనివర్శిటీ వసతి గృహాల నుంచి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ రామచంద్రన్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నలుగురు విద్యార్థులు అమరావతి ప్రాంతానికి చెందిన వారే. స్థానిక రిజర్వేషన్ కింద వారు నాగార్జున యూనివర్శిటీలో సీటు సాధించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ వారంతా తరచూ అమరావతి ప్రాంత రైతుల నిరసనల్లో పాల్గొంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. అమరావతి పరిరక్షణ సమితి సారథ్యాన్ని వహిస్తోన్న ఐక్య కార్యాచరణ కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనే విషయం యూనివర్శిటీ అధికారుల దృష్టికి వచ్చింది.
దీనిపై ప్రత్యేక కమిటీని వేసి విచారణ చేపట్టారు అధికారులు. ఆశీర్వాదం నవీన్, రాజు, ఏడుకొండలుపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు నిజమేనని తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇదివరకే యూనివర్శిటీ అధికారులు నలుగురికీ షోకాజ్ నోటీసులను జారీ చేశారని, వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడం వల్ల సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి జేఏసీ నిర్వహించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నందు వల్ల సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.