దటీజ్ అచ్చెన్నాయుడు స్పెషాలిటీ.. సిక్కోలులో ఆయన చెప్పిందే వేదం
అమరావతి: వారు ఒకే పార్టీ నేతలు.. అంతే కాదు ప్రభుత్వంలో మంత్రులు కూడా. విపక్షాలు విమర్శలు చేసినా, ప్రజల సమస్యల పరిష్కారంలోనైనా కలిసి ముందడుగు వేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయినా మంత్రుల ఆదేశాలు, ఆదేశాలకు అనుగుణంగా ఆయా శాఖల కార్యకలాపాలు నడవాలి. మంత్రుల నిర్ణయం మేరకు ఆయా శాఖల్లో ఉత్తర్వులు వెలువడుతాయి. కానీ ప్రభుత్వ శాఖల్లో సంబంధిత మంత్రి ఆదేశాలు అమలు కావాలంటే మరో మంత్రికి నచ్చాల్సిందే. లేదంటే సదరు మంత్రి ఆదేశాలు ఆ జిల్లాలో అమలుకు నోచుకోవు. అదే శ్రీకాకుళం జిల్లా. ఏ మంత్రి ఏ జీవో జారీ చేసినా సదరు శ్రీకాకుళం జిల్లా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి నచ్చాల్సిందే.
అచ్చెన్నాయుడుకు నచ్చకుంటే సదరు నియామకం నిలిచిపోవాల్సిందే. తాజాగా విద్యాశాఖకు సంబంధించి మంత్రి గంటా ఇచ్చిన ఆదేశాలకు తాజాగా ఈ గతి పట్టింది. జిల్లా విద్యాధికారిగా గంటా శ్రీనివాసరావు నియమించిన ఓ అధికారిని చేరటానికి వీల్లేదని అచ్చెన్న వెనక్కు పంపేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇద్దరు మంత్రుల వివాదంగా మారింది. గతంలో మంత్రి సుజయకృష్ణ రంగారావుకు ఇదే పరిస్థితి నెలకొంది.
సిక్కోలులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అచ్చెన్న
ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారుల (డీఈఓ) పోస్టుల భర్తీ కోసం రెగ్యులర్ డీఈఓలను నియమిస్తూ మానవవనరుల శాఖ శుక్రవారం జీఓ 268 విడుదల చేశారు. 11 జిల్లాలకు రెగ్యులర్ డీఈఓలను నియమించారు. అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎం సాయిరాంను శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిగా నియమించారు. కలెక్టర్ సూచనల మేరకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను జిల్లా డీఈఓగా జాయిన్ కావద్దని చెబుతున్నారని, మంత్రి అచ్చెన్నాయుడును కలవాలని సమాచారం అందింది. తాను జిల్లాలో డిప్యూటీ డీఈఓగా రెండు డివిజన్లలో పనిచేశానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చానని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని అచ్చెన్నకు విన్నవించినా ఫలితం దక్కలేదు. వెనక్కు వెళ్లిపోవాలని మంత్రి అచ్చెన్నాయుడు హుకుం జారీ చేయడంతో ఆ అధికారి ఇంకేమీ మాట్లాడలేకపోయారు.
ఇన్ చార్జి డీఈఓగా విజయనగరం డైట్ లెక్చరర్
డీఈఓల నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అక్కడ ఉన్న కొందరు ఆయన దృష్టికి తేగా ‘ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే. ఏ శాఖ అయినా నామాట ప్రకారం నడవాల్సిందే. నా మాటే జీఓ' అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్ ప్రభాకరరావును మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి డీఈఓగా ఎంపిక చేసుకున్నారు. విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు లేకుండానే ఆయన ఇన్ఛార్జిగా కొనసాగటం గమనార్హం. ఇంతకు ముందు 18 నెలలుగా ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. కొత్త డీఈఓల నియామకం తరువాత ఆయన్ను విజయనగరం డైట్కు పంపినా మళ్లీ రప్పించి ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు.
ఇన్ చార్జీ డీఈఓపై చర్చలు తీసుకుంటామన్న విద్యామంత్రి
తన శాఖ ఉత్తర్వులు అమలు కాకుండా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడం, అధికారిని వెనక్కు పంపడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు ఉండాల్సిందేనని, ఇన్ఛార్జి డీఈఓలను కొనసాగించే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇన్ఛార్జి డీఈఓగా కొనసాగుతున్న అధికారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
సిక్కోలులో అచ్చెన్నతో సర్దుబాటు చేసుకోవాలన్న మంత్రి సుజయకృష్ణ
మంత్రి సుజయకృష్ణ రంగారావుకు గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇసుక ర్యాంపు పొందిన కాంట్రాక్టర్ పనులు చేయకుండా మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుకున్నారు. సుజయకృష్ణ సూచనల మేరకు మైనింగ్ శాఖ కార్యదర్శికి విన్నవించినా.. ‘అచ్చెన్నాయుడిని కలసి ఏదో సర్దుబాటు చేసుకోండి. ఆ జిల్లాలో మేమైనా అచ్చెన్న మాట ప్రకారం నడవాల్సిందే' అని చేతులెత్తేయటం గమనార్హం.