రెచ్చగొడుతున్నారు: జగన్కు మంత్రి చురక, కలలని బాబుపై ఈటెల
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో అమలు చేసే దిశగా వెళ్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన రైతులకు నమ్మకం ఉందని, అందుకే ఆయనను వారు ప్రశ్నించడం లేదని, కొందరు కావాలనే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అన్నారు.
అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే గత పదేళ్ల కాంగ్రెస్ పాలన దోపిడీని ప్రశ్నించాలని నిలదీశారు. ఏమీ లేని పార్టీకి రఘువీరా అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పని రాక్షసుడు అని, ఆయనతో పోటీ పడి పని చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్లోను తాను రుణమాఫీ చేశామన్నారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని నమ్ముతున్నామన్నారు.
పగటి కలలు వద్దు: ఈటెల
2019లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని తెలంగాణ ఆర్థిక శాఖ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడం పక్కన పెడితే, అప్పటి వరకు ఇక్కడ ఆ పార్టీ బతికి బట్టకడితే కదా? అన్నారు.
వరంగల్లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆయన మాట్లాడారు. చంద్రబాబు కలలు కల్లలయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ కకావికలమైందన్నారు. ఆంధ్రలో పరిపాలన మరచి, తెలంగాణ అభివృద్ధిని బాబు ఏ విధంగా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాడో అందరికీ తెలుసునన్నారు.
ప్రతి ఒక్క దళిత బిడ్డ ఉన్నత చదువులు చదవాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య పిలుపునిచ్చారు. కేవలం చదువు మాత్రమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు.
పేదరికంలో పుట్టిన తాను ఎన్నో కష్టాలు పడి చదువుకున్నానని తెలిపారు. సాధించాలనే తపనతో చదవాలని, చదువుతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చనన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం ఆజాద్నగర్లో రాజయ్య ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.