టిడిపిలో కలకలం: బాబును లాగిన కేశినేని, అది తప్పని అచ్చెన్న
తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఆర్టీసీ అధికారులపై చేసిన వ్యాఖ్యల మీద రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఆర్టీసీ అధికారులపై చేసిన వ్యాఖ్యల మీద రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
షాక్: రవాణశాఖపై మరోసారి రెచ్చిపోయిన కేశినేని నాని, ఏం జరిగింది?
కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎవరూ తప్పుదోవ పట్టించం లేదని తేల్చి చెప్పారు.
అధికార పార్టీలో కలకలం
అధికారులపై విమర్శలు చేసిన సందర్భంలో అందులోకి తమ పార్టీ అధినేత చంద్రబాబును కూడా లాగుతున్న విషయాన్ని కేశినేని నాని గుర్తించనట్లుగా ఉందని అంటున్నారు. అధికారులు సిఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం తెలుగుదేశం పార్టీలోనే కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను అచ్చెన్న పరోక్షంగా ఖండించారు.
కాసులకు కక్కుర్తిపడి
అంతకుముందు, కేశినేని నాని ట్రాన్సుపోర్టు అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రవాణాశాఖాధికారులు రూల్స్ అతిక్రమిస్తారని, బస్సు ప్రమాదాలకు కారణం రవాణాశాఖ అధికారులేనని కేశినేని నాని ఆరోపించారు. పాండిచ్ఛేరి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో మాత్రమే స్లీపర్ క్యారియర్ బస్సులకు రిజిస్ట్రేషన్లు ఉంటాయని, ఇతర రాష్ట్రాల్లో అవి తిరగడానికి అర్హత లేదని, కాసులకు కక్కుర్తిపడే అధికారుల వల్లే ఆ బస్సులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతున్నాయని చెప్పారు. అంతేకాదు, సీఎం చంద్రబాబును సైతం అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఇదో పెద్ద స్కాం
అరుణా చల్ ప్రదేశ్ ప్రభుత్వం 2,400 బస్సుల పర్మిట్లను రద్దు చేసిందని నాని చెప్పారు. ఈ విషయాన్ని అధికారికంగా అధికారులకు తెలిపిందని, వివరాలతో కూడిన మెయిల్ను త్వరలో పంపుతామని చెప్పిందని ఆయన చెప్పారు. ఈ 2,400 బస్సుల్లో సుమారు 900 బస్సులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవని, ఏపీకి చెందిన బస్సులు 600 అయితే, తెలంగాణ బస్సులు 300 అని, ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా రవాణా శాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అందుకే వ్యాపారం మానేశానని..
గతంలో తాను ఇదే విషయాన్ని ప్రశ్నించేందుకు వస్తే ఆపరేటర్గా అడుగుతున్నారా? లేక ఎంపీగా అడుగుతున్నారా? అని తనను అడిగారని, రాద్ధాంతం చేస్తున్నానని విమర్శించారని ఆయన చెప్పారు. ఆర్టీఏ అధికారుల అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియజేసేందుకే తాను వ్యాపారం మానేశానని ఆయన తెలిపారు.