నాలుగేళ్లు ఏం పీకావు?...వైఎస్ జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
తిరుపతి:కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రత్యేక హోదాపై టిడిపి చేస్తున్న వంచన దీక్ష నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ అనవసర విషయాలను తెర మీదకు తెస్తున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ కు నిజంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకుంటే మరి నాలుగేళ్లు ఏం పీకారని ప్రశ్నించారు. నాలుగేళ్లు అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించకుండా హఠాత్తుగా ఇలాంటి విషయాలను ప్రకటించడం ప్రత్యేక హోదా పై టిడిపి పోరాటం నుంచి 5 కోట్ల మంది ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయమైనా ఎవరో చెబితే తాము వినాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
అయితే టిడిపి నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు టిడిపి నేతలు కొందరు కూడా నొచ్చుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అచ్చెన్నాయుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే విషయాన్ని అనవసర విషయాలతో పోల్చడం పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అచ్చెన్నాయుడు ఆవేశంలో అన్నారా, లేక ఆలోచించే అన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా టిడిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని, అయినా ఆ ప్రస్తావనే రాలేదని, అలాంటిది ఆ మహానేతను స్మరిస్తూ ఎన్టీఆర్ పేరు పెడతానంటే తప్పేముందని ఎన్టీఆర్ అభిమానులు, ఆయన బంధువులు అభిప్రాయపడుతున్నారట.
అచ్చెన్నాయుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే విషయం అనవసర విషయం అనడంతో పాటు ఎవరో చెబితే తాము వినాల్సిన అవసరం లేదని తీసిపారేయడం వారికి ఆగ్రహం తెప్పించిందట. చేతనైతే వారైనా ఆ పని చేయాలి లేదా అలా చేయడానికి అడ్డంకి ఏంటో వివరించకుండా ప్రముఖుల గౌరవార్థం తీసుకున్న నిర్ణయాన్ని కేవలం రాజకీయ కారణలతో అపహాస్యం చేయడం, తప్పు పట్టడం సరికాదనేది వారి వాదన.
ఏదేమైనా నిమ్మకూరులో పాదయాత్ర సందర్భంగా వైసిపి అధినేత జగన్ చేసిన ప్రకటన కృష్ణా జిల్లా వాసుల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందాన్ని నింపగా...సున్నితమైన అంశాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడటం ద్వారా అచ్చెన్నాయుడు అనవసర వివాదానికి కారకుడైనట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా ఈ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా అచ్చెన్నాయుడు ఈ విషయంపై మరింత చర్చ జరిగేలా చేసి తద్వారా వైసిపికి మరింత లబ్ది చేకూరేందుకు పరోక్షంగా కారకుడైనా ఆశ్చర్యం లేదని, ఈ వివాదం ఇంతటితో సద్దమణగక పోవచ్చని వారు వ్యాఖ్యానిస్తున్నారు.