సభలో ఓటుకు నోటు: రాత్రి జగన్కు కేసీఆర్ ఫోన్ చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్తేనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈరోజు ఓటుకు నోటు కేసుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఓటుకు నోటు అంశాన్ని కేసీఆర్ చెప్పిన మీదటే జగన్ సభలో ప్రస్తావిస్తున్నాడని తమ వద్ద సాక్ష్యాలున్నాయని అన్నారు.
ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు ఓటుకు నోటు కేసుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని స్పీకర్ కోడెల తిరస్కరించారు. ఓటుకు నోటు కేసుపై చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైయస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు.
ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిన్న కేసీఆర్, జగన్కు ఫోన్ చేసి, ఇంకా సభలో ఓటుకు నోటు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగినట్టు తమకు తెలిసిందని, అందుకే సమావేశాల చివరి రోజున వైసీపీ ఈ అంశాన్ని సభలో ప్రస్తావించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని మండిపడ్డారు.
ఇది రాష్ట్ర ప్రజలకు అవమానకరమని, ప్రజలపై గౌరవముంటే ఇలా చేసేవాళ్లు కారని అన్నారు. హైదరాబాదులో ఉన్న ఆంధ్రా ప్రజల సమస్యల గురించి వీరికి పట్టడం లేదని, 11 కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉండి, కోర్టు అనుమతిస్తే సభకు వచ్చిన జగన్కు ఏ ఇతర కేసులనూ ప్రస్తావించే అర్హత లేదని మండిపడ్డారు.
దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఓటుకు నోటు కేసుపై చర్చ జరగాలని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ శాసనసభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు.