ఫేస్బుక్ పోస్ట్: ఇంటూరి రవికిరణ్కు పంచ్ తప్పదా?
పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ను శాసనమండలికి పిలిపించి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తప్పు చేసినట్లు తేలితే శిక్ష ఖాయమని అంటున్నారు.
విజయవాడ: 'పొలిటికల్ పంచ్' పేరుతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న ఇంటూరి రవికిరణ్ బృందం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ముందుకు వచ్చే అవకాశం ఉంది. శాసనమండలిని కించపరిచేలా పోస్టింగులు పెట్టారనే ఫిర్యాదుపై రవికిరణ్ను ఇప్పటికే పోలీసులు అరెస్టుచేసి విడుదల చేశారు.
ఆయనతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మధుసూదన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుళ్లూరు పోలీసు స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు. పోలీసు విచారణలో తప్పు తేలితే బాధ్యులకు శాసనమండలి శిక్ష విధించే అవకాశం ఉందని అంటున్నారు.
మండలిని కించపర్చేలా ఈ వెబ్సైట్లో పోస్టింగులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు మండలి ఛైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చే శారు. ఆయన ఆదేశాలతో ఈ వ్యవహారంపై అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి బాధ్యులెవరో విచారించి తమకు నివేదిక అందజేయాలని ఆయన పోలీసులను కోరారు.
పోలీసులు తమ విచారణ నివేదికను అసెంబ్లీ కార్యదర్శి ద్వారా మండలి చైర్మన్కు అందిస్తారు. ఛైర్మన్ దానిని మండలి ముందు పెడతారు. మే 15, 16 తేదీల్లో శాసనమండలి సమావేశాలు అమరావతిలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఈ నివేదిక మండలి ముందుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బాధ్యులను పోలీసులు గుర్తిస్తే వారికి శాసనమండలి శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.