ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు:ఎండీ సురేంద్రబాబు
విజయవాడ: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ తరుపున ఎన్నో చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు చెప్పారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి తీసుకున్న చర్యలు వివరించారు.
ఆర్టీసీలో అదనపు సిబ్బందిని నియమించి సెలవుల విషయమై తలెత్తుతున్న ఇబ్బందులు తొలగించామని వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు సంస్థ నుంచి పదవీ విరమణ చేసిన వారికి సంబంధించి 20,200 మంది పెన్షన్లు పెండింగ్లో ఉన్నట్టు గుర్తించామన్నారు. వీలైనంత త్వరగా పాత బకాయిలు చెల్లించే పనిలో ఉన్నామన్నారు.
అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఒక శుభవార్త ఉందని, జూన్లో పదవీ విరమణ చేసే వారికి అదే రోజున బెనిఫిట్స్ ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ఇకపై చార్జి మెమోలతో వేధించే పద్ధతి ఉండదన్నారు. అలాగే ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఒక విధానం మంచి సత్ఫలితాన్నిస్తోందన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల వేళలను మార్చడం అనే నిర్ణయం వల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిందని ఎండీ తెలిపారు.