నటుడు ఫిష్ వెంకట్ పేరు మీద నకిలీ ట్విట్టర్ అకౌంట్: వైఎస్ వివేకా హత్యపై కామెంట్స్: కేసు నమోదు
హైదరాబాద్: తెలుగు సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా గుర్తింపు ఉన్న ఫిష్ వెంకట్ పేరు మీద గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్ లో నకిలీ అకౌంట్ ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీమంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై కొన్ని సంచలన వ్యాఖ్యలను అందులో రాశారు. సొంత బాబాయ్ ని చంపి, కోట్ల రూపాయల ఆస్తులను కాజేయడం తమకు తెలియదని వైఎస్ జగన్ ను ఉద్దేశించినట్లుగా ఇందులో రాసుకొచ్చారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఫిష్ వెంకట్ స్పందించారు. సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయ్ చౌదరి అనే వ్యక్తిపై అనుమానాలు ఉన్నట్లు ఫిష్ వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసు కేసు నమోదైన వెంటనే ఫిష్ వెంకట్ పేరు మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్ డిలేట్ కావడం ప్రాధాన్యత సంతరిచుకుంది.
ఫిష్ వెంకట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ జగన్ తో పాటు నడిచారు. తాను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబానికి వీరాభిమానిగా ఫిష్ వెంకట్ చాలాసార్లు చెప్పుకొన్నారు కూడా. అలాంటి తన మీద గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్ లో అకౌంట్ ను తెరిచి, వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేయడం తనను బాధించిందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కలలు గన్నామని, అలాంటి కుటుంబంపై తాను ఆరోపణలు ఎలా చేస్తానని ప్రశ్నించారు. తనకు ట్విట్టర్ అకౌంట్ లేదని, గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటో, పేరు పెట్టి ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేశారని అన్నారు.
ఆ అకౌంట్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ కుటుంబంపై విమర్శలు చేశారని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పారు. తాను అమితంగా అభిమానించే వైఎస్ కుటుంబంపై తన పేరు మీద ఆరోపణలు గుప్పించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిష్ వెంకట్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. జయ్ చౌదరి అనే వ్యక్తి పేరు మీద ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో షేర్ అయినట్టు గుర్తించారు. తొలుత- జయ్ చౌదరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిష్ వెంకట్ పేరు మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్ డిలేట్ అయినట్లు గుర్తించారు. ఎక్కడి నుంచి ఆ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అయిందనే విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తిస్తామని, సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని అన్నారు.