పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నా అన్న సినీనటి హేమ .. సక్సెస్ అవుతారా ?
Recommended Video
ప్రముఖ సినీనటి హేమ సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. తనను సినిమాల్లో ఎలా ఆదరించారో బయట కూడా ప్రజలు అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నానని హేమ పేర్కొన్నారు. రాజమండ్రిలో ఇల్లు కట్టుకుంటున్నానని, హైదరాబాద్లోని సినీ పరిశ్రమను వీడి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్టు హేమ తెలిపారు.
సినిమాల్లో సక్సెస్ అయిన హేమ .. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన
హేమ సినీ ప్రపంచంలో ఒక మంచి నటిగా గుర్తింపు పొందారు. బ్రహ్మానందం వంటి టాప్ కమెడియన్ లతో కలిసి చాలా సినిమాల్లో తన కామెడీతో గిలిగింతలు పెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు క్యారెక్టర్ లు చేసిన హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా ' లో కూడా కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను మెప్పించిన హేమ రాజకీయాల్లో ఇప్పటి వరకు పలు ప్రయోగాలు చేసి ఫెయిల్ అయ్యారు. ఇక ఇప్పుడు వైసీపీలో చేరిన హేమ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు .
సీఎం జగన్ కాపుల కోసం కేటాయించిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన హేమ
తాను ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన హేమ ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కాపుల కోసం బడ్జెట్లో రెండువేల కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయమన్నారు. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసేలా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా హేమ చెప్పారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ' తరఫున పోటీచేసిన హేమ ఓటమిపాలయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ ఉద్యమంలో నాయకురాలిగా కూడా హేమ పని చేశారు . కాపు ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ముద్రగడకు హేమ మద్ధతు పలికారు. హైదరాబాద్లో జరిగిన కాపు సంఘం ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు అంతా చేసినా హేమకు మాత్రం రాజకీయాలు కలిసి రాలేదు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమై మళ్లీ సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నారు.
మళ్లీ ఓ మారు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న హేమ .. సక్సెస్ అవుతారా ?
అయితే తాజాగా మళ్లీ పూర్తిగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని హేమ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు హేమ పలువురు నటులతో కలిసి వైసీపీలో చేరారు. పార్టీలో చేరినా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదు. తాజాగా, సినీ పరిశ్రమకు దూరంగా పూర్తిగా రాజకీయాలకే అంకితం కావాలనుకుంటున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది హేమ. ఈసారైనా హేమ రాజకీయాల్లో నిలదొక్కుకుంటారా. వైసీపీ లో ఉన్న హేమకు జగన్ కు బాసట అందిస్తారా అన్నది ఇప్పుడు ఏపీలో చర్చకు కారణం అవుతుంది.