జగన్ సర్కార్పై హైకోర్టుకు కృష్ణం రాజు,నిర్మాత అశ్వనీదత్... ఆ పరిహారం చెల్లించాలని....
కేంద్ర మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని... ప్రభుత్వం వాటికి తగిన నష్ట పరిహారం చెల్లించాలని పిటిషన్లు దాఖలు చేశారు.
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు అప్పటి ప్రభుత్వం తన 31 ఎకరాల భూమిని తీసుకుందని కృష్ణంరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇంతలోనే మరో ప్రభుత్వం అధికారంలోకి రావడం.. రాజధాని తరలింపుకు సిద్దమైన నేపథ్యంలో.. నష్టపరిహారం చెల్లింపుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ కోసం తనకు చెందిన 39 ఎకరాల భూమిని కూడా అప్పటి ప్రభుత్వం తీసుకుందని నిర్మాత అశ్వనీదత్ పిటిషన్లో పేర్కొన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎకరా రూ.1కోటి 54లక్షలు ఉంటుందని... దానికి సరిసమానమైన భూమిని అమరావతిలో ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు రాజధాని తరలింపుతో అక్కడ విలువ పడిపోయిందని... కాబట్టి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మొత్తం రూ.210కోట్లు ప్రభుత్వం తనకు పరిహారంగా చెల్లించాలన్నారు.
ఇరువురి పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Recommended Video
గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం పూలింగ్ విధానంలో 760 ఎకరాలు భూసేకరణ చేసింది.ఎకరం రూ.2 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ భూములను ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించేందుకు మొదట రైతులెవరూ ముందుకు రాలేదు. దీంతో భూములు పూలింగ్ కింద తీసుకొని, అమరావతి రాజధానిలో ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానులను తెర పైకి తీసుకురావడంతో అమరావతుల భూముల విలువ పడిపోయింది. దీంతో తమకు తగిన పరిహారం చెల్లించాలని లేదా తమ భూములు తమకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది రైతులు విమానాశ్రయ స్వాధీనంలోని భూముల్లో ఇప్పటికే సాగు కూడా చేస్తున్నారు.