లైవ్ కట్పై కృష్ణంరాజు ఫైర్: కిరణ్ బంతి తాకలేదని ఆనం
కాంగ్రెసు తీరు ఎమర్జెన్సీని తలపించిందన్నారు. కాంగ్రెస్ తన దొంగ తెలివితేటలను ప్రదర్శించిందని ఆరోపించారు. ఎలక్షన్ల ముందు తెలంగాణ బిల్లును ఆమోదించి, రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమని, బిల్లులోని అంశాలపై మాటల హామీ ఇస్తే సరిపోదన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలనే కాకుండా దేశం మొత్తాన్ని మోసం చేసిందన్నారు. ఒకరికి న్యాయం చేస్తున్నామని చెప్పి, మరో ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంత సమర్థనీయమం కాదన్నారు. బిజెపి రాజ్యసభలో అడ్డుకుంటుందని, సీమాంధ్రుల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు.
బిజెపి సవరణలకు కేంద్రం అంగీకారం
విభజన బిల్లుపై బిజెపి ప్రతిపాదించిన సవరణలను కేంద్రం ప్రభుత్వం అంగీకరించిందని ఆ పార్టీ నేత హరిబాబు తెలిపారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇరు ప్రాంతాలకు ప్రత్యేక హోదాను పది సంవత్సరాల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా పన్ను రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు హరిబాబు చెప్పారు.
కిరణ్ ఆలస్యంగా రాజీనామా చేశారు: ఆనం
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఆలస్యంగా రాజీనామా చేశారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వేరుగా అన్నారు. తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో లేరని చెప్పారు. తెలంగాణ బిల్లు విషయంలో బిజెపిలో గ్రూపు దగాదాలు బయటపడ్డాయన్నారు.
బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్, అగ్రనేతలు అద్వానీలు బిల్లును వ్యతిరేకిస్తే సుష్మా స్వరాజ్ లోకసభలో సమర్థించారన్నారు. కాంగ్రెసు, బిజెపిలు కలిసి తెలుగు తల్లిని హత్య చేశాయన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు తప్పు చేశాయన్నారు. కిరణ్ వదిలిన బంతుల్లో ఒక్కటి కూడా లక్ష్యాన్ని తాకలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఇరవై నిమిషాల్లో చీల్చిన ఘతన అన్ని పార్టీలది అన్నారు.