కాబోయే సీఎం.. జగన్: స్వీప్ చేయబోతున్నారు, ఎన్టీఆర్ విషయంలో ఇదే చెప్పా, రాసిపెట్టుకోండి: మోహన్ బాబు
హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు రాజకీయాల్లోకి పున: ప్రవేశించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో గల వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మోహన్ బాబు.. తన కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్.. మోహన్ బాబుకు పార్టీ కండువాను కప్పి, సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో వారి వెంట- వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
ఎన్టీఆర్ విషయంలో ఇదే చెప్పా..
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లోనూ స్వీప్ చేయబోతోందని మోహన్ బాబు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రెండో సారి అధికారంలోకి రావడానికి ముందు తాను ఇదే చెప్పానని గుర్తు చేశారు. రెండు, మూడు రోజుల్లో తాను వైఎస్ఆర్ సీపీ తరఫున ప్రచారానికి వెళ్లబోతున్నట్లు మోహన్ బాబు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు గెలవడానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. జగన్ కు తాను మద్దతు ఇవ్వాల్సిన అవసరమే లేదని చెప్పారు. ఆయనకు ఓటు వేసే వాళ్లు కోట్లల్లో ఉన్నారని చెప్పారు. జగన్ ఒక ప్రణాళికా ప్రకారం వెళ్తున్నారని, దాని ప్రకారమే తానూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని మోహన్ బాబు స్పష్టం చేశారు.
జగన్.. వండర్ ఫుల్..
జగన్ వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని మోహన్ బాబు చెప్పారు. చంద్రబాబుతో బంధుత్వం, స్నేహబంధం ఉన్నప్పటికీ.. తాను ఆయన గురించి ఎప్పుడూ సానుకూలంగా స్పందించలేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డిది కూడా మాట మీద నిలబడే వ్యక్తత్వం అని అన్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థ ముందు తాను చేసిన దీక్ష, నిరసన పోరాటాల వల్ల జగన్ ఒరిగేదేమీ లేదని అన్నారు. తన పోరాటం వల్ల జగన్ కు లాభమేదీ లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి సోనియాగాంధీనే ఎదిరించారని ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సోనియాగాంధీతో ఢీ కొట్టిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. తాను పార్టీకి విధేయుడినే గానీ, బానిసను కాదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోనియాగాంధీతో స్పష్టం చేశారని చెప్పారు. 33 మంది ఎంపీలను తీసుకెళ్లి, సోనియా గాంధీతో కలిశారని, ఆ తరువాతే హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)
జగన్ బంధువు..
జగన్మోహన్ రెడ్డి తనకు బంధువు అని, అయినంత మాత్రాన తాను పార్టీలో చేరలేదని అన్నారు. అలా చేరాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ను స్థాపించన రోజే చేరి ఉంటానని అన్నారు. తన అవసరం ఉందని జగన్ కోరడం వల్లే తాను ఆయనకు సహాయకారిగా పార్టీలో చేరానని చెప్పారు. పదవులను అశించి చేరలేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రజలకు మంచి చేస్తాడనే నమ్మకంతో ఆయన పార్టీలో చేరినట్లు తెలిపారు.