మోహన్ బాబుకు జగన్ హ్యాండ్..కలెక్షన్ కింగ్ ప్యాకప్: అదే గ్యాప్ కు కారణమా: సీఎం తేల్చేశారు..!
అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అవన్నీ వైసీపీ కోటాలోకి వెళ్లనున్నాయి. దీంతో రాజ్యసభ సీట్లు ఎవరిని పంపాలన్నదానిపై సీఎం జగన్ ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఒక సీటు రిలయన్స్ అధినేత అంబానీ సన్నిహితుడు పరిమాల్ నత్వానీకి కేటాయిస్తుండగా మరో రెండు సీట్లకుగాను మోపిదేవిని మరో సీటు పండుల రవీంద్రకు ఇస్తున్నట్లు సమాచారం. రాజ్యసభకు తనను పంపుతారని సినీనటులు మోహన్ బాబు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే కలెక్షన్ కింగ్ ఫేట్ ఎలా ఉంది..? సీఎం జగన్ మదిలో నటప్రపూర్ణపై ఎలాంటి అభిప్రాయం ఉంది..?
ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి
ఏపీ రాజ్యసభ ఎన్నికలు అక్కడ పొలిటికల్ హీట్ను క్రియేట్ చేస్తున్నాయి. ఆశావాహులు ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న నాలుగు సీట్లలో మూడు సీట్లపై క్లారిటీ రాగా మరో సీటుకోసం ఆశావాహులు తమదైన స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజ్యసభలో రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ లేదని ఇప్పటికే ఒక పిక్చర్ వచ్చేసింది. అయితే రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి లేదా కలెక్షన్ కింగ్ మోహన్బాబుకు ఛాన్స్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఇక మోహన్ బాబుకే ఆ అవకాశం దక్కుతుందని భావించారు. కానీ బొమ్మ మరోలా కనిపిస్తోంది.
మోహన్బాబుకు డోర్స్ క్లోజ్
2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మోహన్బాబు. అంతకంటే ముందు వైయస్ కుటుంబంతో బంధుత్వం ఉంది. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు మోహన్బాబుకు ఉండేవి. ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా మోహన్ బాబు ప్రచారం చేశారు. 2019లో పార్టీలో చేరగానే ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తారని భావించారు. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి పైనా ఆశలు పెట్టుకున్నారు. అయితే అది దక్కకపోవడంతో టీటీడీ ఛైర్మెన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా అక్కడా భంగపాటే ఎదురైంది. ఇక రాజ్యసభకు పంపుతారనే వార్తలు జోరుగా షికారు చేశాయి. అయితే ఇక్కడ కూడా డోర్స్ దాదాపుగా క్లోజ్ అయినట్టే కనిపిస్తున్నాయి.
ప్రధాని మోడీ అమిత్ షాలతో భేటీనే కారణమా?
ఎన్నికల ఫలితాల తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్బాబు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా యాక్టివ్గా కనిపించలేదు. అదే సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని తాను అయ్యారంటూ ముక్తసరి వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల క్రితం ఒక్కసారిగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో మోహన్ బాబు బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం కూడా బాగా జరిగింది. తాను జగన్తోనే ఉన్నట్లు చెబుతూనే మోడీ, అమిత్షాలతో ఎందుకు భేటీ కావాల్సి వచ్చిందనేదానిపై మాత్రం సమాధానం దాటవేశారు.
Recommended Video
బీజేపీలో చేరుతున్నారంటూ అప్పట్లో వార్తలు
ఇక రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న మోహన్బాబు... ప్రధాని మోడీతో భేటీ తర్వాత సీఎం జగన్ను ఒక్కసారి కూడా కలిసిన దాఖలాలు లేవు. ఇక ఉన్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక సీటు మహిళకు కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తలతో మోహన్బాబుకు అవకాశం లేనట్టే కనిపిస్తోంది. సామాజిక వర్గాల వారీగా చూసినా కలెక్షన్కింగ్కు అవకాశం లేనట్టే కనిపిస్తోందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మోడీ అమిత్ షాలను కలిసి బీజేపీలో చేరుతున్నట్లు లీకులు ఇవ్వడమే జగన్ ఆగ్రహానికి కారణమైందని పలువురు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక అన్ని అవకాశాలు క్లోజ్ అవడంతో మోహన్బాబు ఎలాంటి టర్న్ తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బీజేపీలో చేరి సీఎం జగన్కు రివర్స్ షాకిస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.