జలదీక్ష: హీరో శివాజీ గడ్డిబొమ్మ దగ్ధం
ఏలూరు: బిజెపి రాష్ట్ర నాయకులపై, కేంద్ర నాయకుడు వెంకయ్యనాయుడిపై, తదితరులపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సినీనటుడు శివాజీ గడ్డిబొమ్మను దగ్ధం చేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర, రాష్ట్ర, బిజెపి సమన్వయకర్త పి రఘురామ్ పాల్గొన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోది నాయకత్వంలో వినూత్నంగా పయనిస్తూ ప్రజలకు దగ్గరవుతోందని చెప్పారు. అభివృద్ధి పథంలో భారత్ను నడపటానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారం తరువాత శివాజీ ఆశించిన పదవి రాలేదనో, లేదా బ్లాక్మెయిలింగ్ రాజకీయాల కోసమో, లేదా పార్టీ ముసుగులో ఉంటూ బిజెపిని నిర్వీర్యం చేయాలన్న కుట్రతోనో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సోము వీర్రాజు లాంటి పార్టీకి అంకితమైన వారిని కూడా విమర్శించడం ఆయనకు తగదని రఘురామ్ అన్నారు.
ఇష్టంలేనప్పుడు ఆయన స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లవచ్చని సూచించారు. విమర్శలు మానుకోక పోతే ఆయన నటించిన చిత్రాలను థియేటర్లో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
బిజెవైఎం జిల్లా కార్యదర్శి కాండూరి రవి , పట్టణ అధ్యక్షుడు నాళం బాబి, జిల్లా నాయకుడు రావూరి సుధ, రాష్ట్ర బిజెపి దళితమోర్చా కార్యవర్గ సభ్యుడు కోరం ముసలయ్య, కోరాడ సూరిబాబు, శిడగం పాపారావు, మామిడి శివయ్య, కొల్లి కొండ ప్రసాద్, కె దుర్గాప్రసాద్, రావూరి రాజా, కబర్ధి, ఎం పుల్లయ్యనాయుడు, బోడా కనకరాజు తదితరులు నాయకత్వం వహించారు. సినీ నటుడు ప్లెక్సీని పాడె గట్టి ఊరేగించి టాక్సీ స్టాండ్ సెంటర్లో దగ్ధం చేశారు.