కొత్త నాయకుడి ప్లాన్ చెప్తా, వైసీపీలో వారిని పక్కనపెట్టండి, సీఎం అవుతారు: జగన్పై శివాజీ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని సినీ నటుడు, ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయాల్లో విమర్శలు ఎదుర్కొన్న శివాజీ అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
చదవండి: జగన్పై దాడి ఎఫెక్ట్: బాబు కీలక నిర్ణయం, ఢిల్లీలో జాతీయస్థాయిలో చంద్రబాబు గళం
అందుకే జగన్ పైన ప్రశంసలా?
ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని, ఆపరేషన్ గరుడ అంతా చంద్రబాబు ప్లాన్ కాగా, దానిని శివాజీ చెబుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ విమర్శల నుంచి బయటపడేందుకు జగన్పై ప్రశంసలు కురిపించారని భావిస్తున్నారు.
జగన్ ఇలా చేయండి.. సూచన
ప్రజల కోసం ప్రతిపక్ష నేత జగన్ చాలా కష్టపడుతున్నారని శివాజీ అన్నారు. ఏదో ఒకరోజు ఆయన ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అలాగే, జగన్కు ఓ సలహా ఇచ్చారు. వైసీపీలో ఎప్పుడూ దూషణలకు పాల్పడేవారిని పక్కన పెట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారితో మాట్లాడిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
చంద్రబాబును తిట్టినప్పుడు వైసీపీ నేతలు అడిగారు
గతంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా విమర్శించానని చెప్పారు. అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనను సంప్రదించారని, తమతో కలిసి రావాలని అడిగారని చెప్పారు. కానీ తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, ప్రత్యేక హోదా సాధనే తన లక్ష్యమని చెప్పారు.
కొత్త నాయకుడి ప్లాన్ త్వరలో చెబుతా
ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాయకుడు వేసిన ప్లాన్ విఫలమైందని శివాజీ చెప్పారు. త్వరలోనే ఆ కుట్ర సమాచారాన్ని బయటపెడతానని అన్నారు. ఆ కొత్త నాయకుడు ఎవరనే విషయం చెప్పలేదు. గతంలో తాను చేసిన ప్రతివ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.