కష్టమే: సినీపరిశ్రమ తరలింపు, రాజకీయాలపై సుమన్
శ్రీకాకుళం: తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని, విశాఖకు సినీ పరిశ్రమ తరలింపు ఇప్పట్లో సాధ్యం కాదని ప్రముఖ సినిమా నటుడు సుమన్ ఆదివారం అన్నాడు. రామోజీ ఫిలిం సిటీ పైన ఆయన ప్రశంసలు కురిపించారు. ఆర్ఎఫ్సీని అత్యంత ఆధునికంగా రూపొందించారన్నారు.
సుమన్ ఆదివారం నాడు ఓ రెసిడెన్సీలో పుస్తకావిష్కరణకు విచ్చేశారు. అనంతరం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సినీ వర్గాలకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ హైదరాబాద్ నుంచి విశాఖకు చిత్రపరిశ్రమను తరలించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు. చెన్నై నుండి హైదరాబాదుకు తరలివచ్చిన సినీ పరిశ్రమ విశాఖకు రావడం కష్టమే అన్నారు. భూమి విలువ పెరగడంతో స్టూడియో నిర్మాణాలు కష్టమన్నారు.
విశాఖలో చిత్ర నిర్మాణానికి అవుట్డోర్ అవకాశం ఉన్నప్పటికీ సినీ స్టూడియోలు, శాశ్వత వసతి సౌకర్యాలను సమకూర్చాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులు, ప్రభుత్వం ముందుకు వచ్చే పక్షంలో సాధ్యం కాగలదన్నారు. మా సంస్థలో వర్గ విభేదాలను ప్రస్తావిస్తూ అధ్యక్ష పదవికి పోటీ అనివార్యమైనప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు.
ప్రపంచంలో పది ఉన్నాయంటే దాంట్లో అత్యుత్తమమైనది రామోజీ ఫిలిం సిటీ అన్నారు. నైపుణ్యాలు, సెట్టింగులు, షూటింగ్ పరంగా ఉన్నత ప్రమాణాలు ఉన్న ఏకైక ఫిలిం సిటీ అన్నారు. అక్కడ సినిమా చిత్రీకరణ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. సినిమా తీయడానికి కావాల్సిన వసతులు, సౌకర్యాలు అన్నీ ఉన్నాయన్నారు.
తన సినీ ప్రస్తావనను వివరిస్తూ అన్నమయ్య, భక్తరామదాసు చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని, అలాంటి దశలోనే వేసిన పాత్రలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నానన్నారు.
క్రిష్ దర్శకత్వంలో హిందీతోపాటు మరో నాలుగు భాషల్లో నిర్మాణం జరుగుతున్న చిత్రాల్లో ప్రధాన ప్రతినాయకుని పాత్రను పోషిస్తున్నానన్నారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, అయితే బిసి వర్గానికి సముచితస్థానం కల్పించడానికి ఎలాంటి పోరాటానికైనా తాను ముందుంటానని చెప్పారు.