విశాఖ భేష్: సుమన్, ఆఫీసర్ల హాజరు తీసుకుంటా: బాబు, రాజధానికి రూ.కోటి విరాళం
విజయవాడ: విశాఖ నగరం సినిమా షూటింగులకు అనువైన ప్రాంతమని సినీ నటుడు సుమన్ బుధవారం నాడు అన్నారు. సంపత్ వినాయక ఆలయంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 5 సినిమా షూటింగును మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ ప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడారు. సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరం షూటింగులకు అనువైన ప్రాంతమని చెప్పారు.
రాజధానికి వృద్దురాలు రూ.కోటి విరాళం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 80 ఏళ్ల వృద్ధురాలు స్వరాజ్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ విరాళం ఇచ్చారు.
విజయవాడలో సీంఎంను కలిసిన ఆమె రూ.కోటి విరాళాన్ని అందించారు. స్వరాజ్యం స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళం ఇవ్వాలనిపించిందని, అందుకే సీఎంకు ఇచ్చానని చెప్పారు.
వచ్చే సమావేశాల నుంచి హాజరు తీసుకుంటా: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం మంత్రులు, జన్మభూమి కమిటీలు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులకు హాజరు కాని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. వచ్చేసారి అధికారుల హాజరు తీసుకుంటానని చెప్పారు. ఈ పాస్ విధానాన్ని రద్దు చేయించేందుకు కొందరు ప్రయత్నించారన్నారు.