రాజధాని గ్రామాల పర్యటనకు బాలయ్య డుమ్మా: చంద్రబాబు పిలిచినా.. సీన్లోకి రాని నటసింహం.. !
అమరావతి: అమరావతి గ్రామాల రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డుమ్మా కొట్టారు. సంక్రాంతి పండుగ తరువాత ఇక బాలకృష్ణ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు. పండుగ ముగిసినప్పటికీ.. బాలయ్య జాడ మాత్రం కనిపించట్లేదు. ఆయన రాకపోవడం పట్ల టీడీపీ నాయకుల్లో అసహనం వ్యక్తమౌతోంది.
వైసీపీ వైపు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే: ఇక ఆ జిల్లాలో టీడీపీ గడ్డు పరిస్థితులు.!
నెలరోజులకు పైగా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నెలరోజులు దాటిపోయాయి. రైతుల ఆందోళనలకు నాయకత్వాన్ని వహిస్తోన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జోలె పట్టి మరీ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. బైక్ ర్యాలీలను నిర్వహిస్తూ రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. తాము ఉన్నామనే భరోసాను ఇస్తున్నారు.
ఊపు తెస్తారనుకుంటే..
నెలరోజులకు పైగా తాము చేస్తోన్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, పోరాటాల్లో బాలకృష్ణ ఒక్కసారి పాల్గొంటే.. ఊపు వస్తుందని ఆశించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తనదైన శైలిలో బాలకృష్ణ సంధించే డైలాగులు ఆందోళనల్లో ఊపు తెస్తాయని భావించారు. దీనికి అనుగుణంగా ఆయన షెడ్యూల్ను సైతం రూపొందించింది పార్టీ అగ్ర నాయకత్వం. సంక్రాంతి పండుగ తరువాత బాలకృష్ణ రాజధాని గ్రామాల్లో పర్యటించేలా ఓ రోడ్ మ్యాప్ను సైతం సిద్ధం చేసింది.
16 నుంచి వరుసగా..
ఈ రోడ్ మ్యాప్ ప్రకారం చూస్తే.. ఇప్పటికే బాలకృష్ణ రాజధాని గ్రామాల్లో ఓ రౌండ్ పర్యటన పూర్తి కావాల్సి ఉంది. 16,17,18 తేదీల్లో ఆయన తుళ్లూరు, మందడం, నిడమర్రు, పెదపరిమి, కృష్ణాయపాలెం, రాయపూడి, పెనుమాక, ఉండవల్లి వంటి గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. రోజులు గడిచిపోతున్నాయే తప్ప బాలకృష్ణ పర్యటనకు మాత్రం రాలేదు. దీనిపై టీడీపీ పార్టీ క్యాడర్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వాయిదా మాత్రమే.. రద్దు కాలేదు
బాలకృష్ణ పర్యటన తాత్కాలికంగా వాయిదా మాత్రమే పడిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సోమవారం నుంచి ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని అంటున్నారు. దీనిపై స్పష్టత లేదు. వాయిదా పడిందనే అనుకున్నప్పటికీ.. ఎప్పటి నుంచి ఆయన పర్యటిస్తారనే విషయాన్ని ఖచ్చితంగా, అధికారికంగా చెప్పలేకపోతున్నారు. దీన్ని సొంత పార్టీ కార్యకర్తలే కొట్టివేస్తున్నారు. బాలకృష్ణ రాజధాని గ్రామాల్లో పర్యటనకు రాకపోవడానికి, వాయిదా వేసుకోవడానికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
భువనేశ్వరి, బ్రాహ్మణి పర్యటనతో..
అమరావతి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పర్యటించారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను రాజధాని ప్రాంత రైతులతో జరుపుకొన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి పర్యటనలు రైతులు, వారి కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపిందని అంటున్నారు పార్టీ కార్యకర్తలు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకూ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో.. చంద్రబాబు కుటుంబం మరోసారి రైతుల ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని అంటున్నారు.