ఎన్టీఆర్ ఇంకా కళ్లముందే కదలాడుతున్నట్టుంది: చంద్రబాబు: ఘాట్ వద్ద బాలకృష్ణ, లక్ష్మీపార్వతి నివాళి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి పురస్కరించుకుని సోమవారం పలువురు టీడీపీ నేతలు ఆయనకు నివాళి అర్పించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి తదితరులు ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి, నివాళి అర్పించారు.
ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు రెడీ: రీఓపెన్ ఎప్పుడంటే?: గుర్తు పట్టలేనంతగా మార్పు
ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి అవతారం ఎత్తిన థీరుడని బాలకృష్ణ అన్నారు. ఆయన గురించి మాట్లాడడమంటే సూర్యుడిని వేలెత్తి చూపించినట్లవుతుందని వ్యాఖ్యానించారు. పుట్టిన ప్రతి ఒక్కడూ మహానుభావులు కాలేరని, ఎన్టీఆర్ అలాంటి ఘనతను సాధించిన యుగ పురుషుడని చెప్పారు. అకుంఠితదీక్షతో ఎలాంటి కార్యాన్నయినా సాధించవచ్చని చేతలతో నిరూపించారని చెప్పారు. అత్యున్నత వ్యక్తిత్వం, అదే స్థాయిలో నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఎన్టీ రామారావు చిరునామాగా నిలిచారని, దేశ చరిత్రలో చిరస్మరణీయుడని అన్నారు.
రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాదిగా ఆయనను అభివర్ణించారు. పేదలకు ఆహారభద్రత, నివాస భద్రతను అందించి, సంక్షేమ పాలనకు ఆద్యుడిగా నిలిచారని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని చంద్రబాబు చెప్పారు. ఆయన దూరమై 25 సంవత్సరాలు అయినప్పటికీ కళ్ళముందే కదలాడుతున్నట్టు ఉందని అన్నారు.. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్కు మనం అందించే అసలైన నివాళి అని చెప్పారు.
సామాన్య రైతుబిడ్డగా పుట్టి వెండితెర దేవుడై వెలిగి మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని ఎన్టీ రామారావు నిరూపించారని నారా లోకేష్ అన్నారు. 60 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలను సాధించారని గుర్తు చేశారు. సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారని చెప్పారు. మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ గారి లక్ష్యమని అన్నారు.