'తొక్కేస్తారన్న భయం లేదు.. ముద్రగడకు ఉడతాభక్తిగా నావంతు మద్దతు..'
కాపు ఉద్యమంలో పాల్గొంటే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేదని అన్నారు.
కాకినాడ: జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటి చేసి విఫలమైన సినీ నటి హేమ.. ఆ తర్వాత రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించలేదు. కనీసం తన నోటి వెంట ఎప్పుడూ రాజకీయాలను ప్రస్తావించిన దాఖలా కూడా లేదు.
అయితే మళ్లీ ఇన్నాళ్లకు హేమ రాజకీయాల గురించి ప్రస్తావించడం.. అదీ అధికార పార్టీకి వ్యతిరేకంగా.. ఓ ఫైర్ బ్రాండ్ తరహా వ్యాఖ్యలు చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ ను సమర్థిస్తూ ఈరోజు ఆయనకు మద్దతు తెలపడానికి వెళ్లారు హేమ.
ఈ నేపథ్యంలో గురువారం నాడు జరిగిన కాపు మహిళా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ముద్రగడకు ఉడతాభక్తిగా తనవంతు సహాయం అందించేందుకే తనకు తానుగా సదస్సుకు వచ్చానని చెప్పారు. కాపు ఉద్యమంలో పాల్గొంటే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేదని అన్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామిని గుర్తుచేస్తూ.. కాపులను బీసీల్లో చేరుస్తామన్న మేనిఫెస్టోను గుర్తెరిగి కూడా మిగతా కులాల నాయకులు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారని హేమ ప్రశ్నించారు. కాగా, సదస్సులో పాల్గొన్నవారంతా కంచాలను గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. మొత్తానికి కాపు ఉద్యమానికి తనవంతుగా మద్దతు ప్రకటించిన హేమ.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే ప్రయత్నమేమైనా చేస్తారా? అన్నది వేచి చూడాలి.