టీడీపీలో నాపై కక్షకట్టారు! అవమానం, ఊహించలేదు: బీజేపీలో చేరిన నటి కవిత
విజయవాడ: ఓ వైపు టీడీపీ నేతల విమర్శలు, అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్యనేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీ నుంచి పార్టీ సహ సంఘటన కార్యదర్శి సతీష్ జీ హాజరయ్యారు. టీడీపీతో పొత్తు దాదాపు విచ్చిన్నమైన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ, టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా జవాబివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కీలక చర్చ
అంతేగాక, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకెళ్లాలనేదానిపై నేతలు చర్చించారు. ఇకపై తెలుగుదేశం పార్టీతో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఈ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రభుత్వా న్ని ఎలా ఎదుర్కొనాలనే అంశంపైన నేతలు సమాలోచనలు చేశారు
బీజేపీలో చేరిన సినీ నటి కవిత
ఈ సందర్భంగా సినీనటి కవిత కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు టీడీపీలో చాలాకాలం పాటు కొనసాగిన కవిత గత మహానాడులో తనకు అవమానం జరిగిందని కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
నాపై కక్షకట్టారు
బీజేపీలో చేరిన సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీడీపీని వదిలిపెట్టాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. కొందరు కక్ష్యగట్టి తనను బయటకు వెళ్లిపోయేలా చేశారని కవిత ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నిస్వార్థంగా పని చేశానని... ఇపుడు తనకు ఆ పార్టీలో సరైన గౌరవం లేకపోవటంతో దూరంగా ఉన్నానని తెలిపారు.
మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి..
నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భేటీ బచావో భేటీ పడావో వంటి పథకాలకు ఆకర్షితులై బిజెపిలో చేరినట్లు కవిత చెప్పారు. కాగా, కవితతో పాటు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు హరిబాబు తెలిపారు. దేశాభివృద్దిని కోరుకునే వారంతా భాజపా వైపు రావాలని పిలుపునిచ్చారు.