నకిలీ నాణేల స్కాంలో రూ. 30కోట్ల డీల్: ప్రత్తిపాటిపై తమ్మినేని సంచలనం
శ్రీకాకుళం: నకిలీ నాణేల ముఠా వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొటారి నేతలే ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నకిలీ నాణేల కేసులో 20 నుంచి 30 కోట్ల రూపాయల మేరకు డీల్ జరిగిందని ఆరోపించారు.
నకిలీ నాణేల మూలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉన్నాయని తమ్మినేని సీతారాం అన్నారు. ఈ వ్యవహారమంతా లింగమనేని ఎస్టేట్ కేంద్రంగా జరిగిందని ఆరోపించారు. శ్రీకాకుళంలో అరెస్ట్ అయిన నిందితులకు ఆ స్థాయి లేదన్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శ్రీకాకుళం జిల్లా రహస్య పర్యటన, ఎస్పీతో చర్చల వెనుక అంతర్యంపై విచారణ చేపట్టాలని తమ్మినేని డిమాండ్ చేశారు. కాగా, నకిలీనాణేల కేసులో సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్ ఎస్సై పి.రామకృష్ణ, కానిస్టేబుల్ పి.శ్రీనివాసరావును అరెస్టు చేసిన విషయం తెలిసిందేనని, జులై 3న నకిలీ ఇరీనియం నాణేలు, మహిమగల ఇతర వస్తువుల పేరుతో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని వివరించారు.
అయితే, వారికి సహకరించారనే ఆరోపణలతోనే పోలీసులను అరెస్టు చేసి జిల్లా ఎస్పీ జె బ్రహ్మారెడ్డి నిజాయితీ రుజువు చేసుకున్నప్పటికీ, ఆ మూలాలు, వాటి వెనుక రసహ్య ఒప్పందాలు, అధికార పార్టీ నేతల వ్యూహాలపై పూర్తిగా విచారణ చేసి బహిర్గతం చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువే మహిమగల నాణెం పేరుతో మోసం చేసిన కేసులో కీలక సూత్రధారని తమ్మినేని సీతారాం ఆరోపించారు. పోలీసుల దర్యాప్తు పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే వాస్తవాలు దాచిపెట్టొద్దని హితవు పలికారు. ఈ ఏడాది జూన్ 26న సీతంపేట గిరిజన ప్రాంతంలో మంత్రి బంధువు శ్రీనివాసరావుకు, విజయనగరానికి చెందిన నిందితుడు దేవుడుబాబుకు సుమారు 57 లక్షల రూపాయల డీల్ కుదిరిందని తెలిపారు.
ఇటువంటి మోసపూరిత వ్యాపారాలు చేయడం వారికి కొత్తేమీ కాదని, నిత్యమూ కృష్ణమ్మ సాక్షిగా, లింగమనేని ఎస్టేట్స్లో బేరసారాలు జరుగుతూనే ఉంటాయన్నారు. అయితే దేవుడుబాబుకు, శ్రీనివాసరావుకు కుదిరిన డీల్లో డూప్లికేట్ నాణెం అందివ్వడంతో విషయం బయటపడిందన్నారు.
అప్పటికే లక్షల రూపాయలు తీసుకున్న దేవుడుబాబు పరారీకాగా శ్రీనివాసరావు మంత్రితో మాట్లాడి డిఐజి, ఎస్పీలకు ఫోన్లు చేయించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మంత్రి ప్రత్తిపాటి ఆగ్రహానికి గురై పోలీసు బాస్లు నగరంలోని బ్లూఎర్త్ హోటల్లో సమావేశమై మంతనాలు సాగించారని తమ్మినేని సీతారాం ఆరోపించారు.