హింసించారు: ఆదాల, ఎమ్మెల్యేల్ని కూర్చోబెట్టిన కెవిపి
హైదరాబాద్: రెండు రోజులుగా తమకు నిద్ర లేకుండా హింసించారని రాజ్యసభ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నాయకుల పైన మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థులుగా రాజ్యసభకు నామినేషన్ వేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, చైతన్య రాజుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.
దీనిపై ఆదాల స్పందిస్తూ.. రాజ్యసభకు నామినేషన్ వేసినందుకు రెండు రోజులుగా నిద్ర లేకుండా తమను హింసించారన్నారు. తమకు సంతకాలు పెట్టిన వారి పైన ఒత్తిడి తెచ్చారన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా న్యాయం గెలిచిందన్నారు. శాసన సభ్యులను నిర్బంధించి దుర్మార్గానికి పాల్పడినా ఏం జరగలేదన్నారు. కొందరు దుర్మార్గులు చేయని కుట్ర లేదని నిప్పులు చెరిగారు.
న్యాయం గెలిచిందని చైతన్య రాజు అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఎన్నికలలో తాము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పారు. చాలామంది సమైక్యాంధ్రకు మద్దతుగా తమకు ఓటు వేస్తారన్నారు. తమకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు అన్నీ చదివాకే సంతకాలు చేశారన్నారు.
అక్బర్కు దానం విజ్ఞప్తి
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని మంత్రి దానం నాగేందర్ కోరారు. గురువారం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అక్బర్ చెప్పారు.
కెవిపి మంత్రాంగం
రెబల్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన వారిని కెవిపి రామచంద్ర రావు అసెంబ్లీ లాబీల్లో తన వద్దే కూర్చుండబెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు బయటకు వెళ్తే రెబల్ అభ్యర్థులకు మద్దతిస్తారనే ఉద్దేశ్యంతో వారిని కెవిపి తన వద్దే ఉంచుకున్నారు.