ఏప్రిల్లో అమరావతికి అదానీ.. జగన్ తో భేటీ- డేటా హబ్ సహా పెట్టుబడులకు అవకాశం !
ఏపీలో పెట్టుబడుల వాతావారణం లేదంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అమరావతి వచ్చి వెళ్లారు. తన సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు దేశంలో మరో కీలక వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ కూడా వచ్చే నెలలో అమరావతి రానున్నట్లు తెలుస్తోంది.
ముకేష్ అంబానీ రాకతో...
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో ప్రభుత్వం ఇరుకునపడింది. ముఖ్యంగా వైసీపీ సర్కారు తీసుకున్న పీపీఏల సమీక్ష, పరిశ్రమల్లో 75 శాతం స్దానిక కోటా నిర్ణయాలు ఎదురుతన్నాయి. దీంతో పెట్టుబడుల వాతావరణంపై తీవ్ర ప్రభావం పడింది. అయితే దీన్ని మరిపించేలా ఈ ఏడాది ఆరంభంలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం పెట్టుబడుల వాతావరణాన్ని తిరిగి గాడిన పెట్టే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతి వచ్చి వెళ్లారు. పైకి కనిపిస్తున్న పరిమళ్ నత్వానీ రాజ్యసభ సీటు వ్యవహారాన్ని పక్కనబెడితే త్వరలో రిలయన్స్ తరఫున కీలక పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి..
తాజాగా అదానీ రాక ఖరారు ?
దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అంబానీ రాకతో ఏఫీలో పెట్టుబడుల వాతావరణం మెరుగుపడేందుకు తొలి అడుగు పడింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా అదానీ గ్రూపుతో వైసీపీ ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. వీటిలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్లు తెలిసింది. తేదీలు ఇంకా ఖరారు కాకపోయినా అదానీ అమరావతికి రావడం ఖరారైనట్లు వైసీపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ తో అదానీ భేటీ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించాలనేది వైసీపీ పెద్దల ఆలోచనగా ఉంది.
అదానీ రాక ప్రభావం..
విశాఖపట్నంలో 70 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద డేటా హబ్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ గత ప్రభుత్వ హయాంలోనే సిద్దమైంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మారిన పరిస్ధితులు, అదానీ గ్రూప్ కు విశాఖలో కేటాయించిన స్ధలం వివాదాస్పదం కావడం వంటి కారణాలతో డేట్ హబ్ పరిమాణాన్ని కేవలం 3 నుంచి 4 వేల కోట్లకు తగ్గించుకుని, తెలంగాణలోని హైదరాబాద్ లో మరో పెద్ద హబ్ ఏర్పాటుకు అదానీ అంగీకరించారు. అయితే దీనిపై అప్పటి నుంచి అదానీ గ్రూప్ తో పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. విశాఖలో డేట్ హబ్ పరిమాణం తగ్గించుకున్న తర్వాత రాజధాని ఖరారు కావడంతో ఈ ప్లాన్ ను పునస్సమీక్షించాలని అదానీని ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు అదానీ వచ్చేనెలలో ఏపీకి వస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అదానీ రాకతో పెట్టుబడులకు ఊపు ?
దేశంలో రిలయన్స్ తర్వాత అతిపెద్ద గ్రూపు అయిన అదానీ గ్రూపు ఛైర్మన్ గా ఉన్న గౌతం అంబానీ ఏపీకి వస్తే పెట్టుబడుల రాక ఊపందుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదానీ గ్రూప్ విశాఖలో పూర్తిస్ధాయి డేటా హబ్ కు అంగీకరిస్తే, దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగతా పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలవుతాయి. అదే సమయంలో అదానీ తర్వాత మరికొంతమంది భారీ పారిశ్రామికవేత్తలను ఏఫీకి రప్పించేందుకు అవకాశాలు మెరుగుపడతాయని కూడా ప్రభుత్వం భావిస్తోంది.