సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిగకు 'ఆదర్శ' పురస్కారం
అమరావతి: క్రికెట్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామానికి జాతీయస్థాయిలో పురస్కారం లభించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగకు ఆదర్శ గ్రామం పురస్కారం లభించింది.
మధ్యప్రదేశ్ లోని భోపాల్లో 'సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన'పై గురువారం నిర్వహించి సమావేశంలో కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ నుంచి నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ ఈ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిగ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జేసీ అహ్మద్ ఈ సమావేశంలో వివరించారు. పుట్టంరాజువారి కండ్రిగ విదేశీ గ్రామాలను తలదన్నేలా తయారైంది.
గ్రామంలో రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు, వ్యవసాయ పనులు, చేపల పెంపకం ఇలా ఒకటేమిటీ అభివృద్ధిలో కండ్రిగ దూసుకుపోతోంది. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నసచిన్ తన ఎంపీ నిధులను గ్రామాభివృద్ధికే వినియోగించారు.
సచిన్ టెండూల్కర్ ఎంపీ నిధుల నుంచి సుమారు రూ. 2.79 కోట్ల నిధులు విడుదల చేయగా, ప్రభుత్వం మరో రూ. 3 కోట్లు నిధులు ఇచ్చింది. దీంతో ఆ నిధులతో అభివృద్ధి పనులు ఆ గ్రామంలో వేగవంతంగా జరుగుతున్నాయి.