భారీ ర్యాలీగా గొట్టిపాటి: ఫ్లెక్సీలు ధ్వంసం, అద్దంకిలో హైటెన్షన్..!
అమరావతి: అద్దంకి నియోజకవర్గం నుంచి సార్వత్రికి ఎన్నికల్లో వైసీపీ టికెట్పై బరిలోకి దిగి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ బుధవారం భారీ అనుచరగణంతో కలిసి విజయవాడలోని ఎన్ కన్వెక్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రాబబు నాయుడి సమక్షంలో టీడీపీలోకి చేరనున్నారు.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకిలో భారీ సంఖ్యలో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే అద్దంకిలో ఏర్పాటు చేసిన పలు ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళారం రాత్రి ధ్వంసం చేశారు. తమ ఫ్లెక్సీలు ధ్వంసమైన విషయాన్ని బుధవారం ఉదయం గుర్తించిన గొట్టిపాటి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో అద్దంకిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో భారీ సంఖ్యలో పోలీసులను మెహరించారు. మరోవైపు టీడీపీలోకి గొట్టిపాటి రాకను పార్టీ సీనియర్ నేత కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కరణం బలరాంను పిలిచి ఈ విషయమై మాట్లాడారు. ఈ భేటీ అనంతరం కరణం బలరాం మాట్లాడుతూ రకరకాల నాయకులు, నేతలు రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గొట్టిపాటిని ఉద్దేశించి అన్నారు. అక్రమ సంపాదన రక్షించుకునేందుకే కొందరు నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
గొట్టిపాటితో ఇప్పుడే తాము కలిసి పనిచేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. అద్దంకిలో గొట్టిపాటి, కరణం కుటుంబాల మధ్య గతంలో పలు ఫ్యాక్షన్ గొడవులు సైతం జరిగాయి. ఈ క్రమంలో గొట్టిపాటి టీడీపీలోకి చేరడాన్ని కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు. గొట్టిపాటి, కరణం వర్గాలు ఎక్కడ ఘర్షణకు దిగుతాయోనన్న అనుమానంతోనే పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు.
ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంటి నుంచి గొట్టిపాటి భారీ అనుచరగణంతో ఈరోజు ఉదయం విజయవాడకు బయలుదేరనున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ నేతలంతా గొట్టిపాటి వెంటే నడిచేందుకు నిర్ణయించుకున్నారు.
గొట్టిపాటితో పాటు వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీపీలు, ముగ్గురు జడ్పీటీసీలు, 36 మంది ఎంపీటీసీలు, 47 మంది సర్పంచ్ లు, 19 మంది సహకార సంఘాల అధ్యక్షులు, ఐదుగురు మునిసిపల్ కౌన్సిలర్లు నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు వారి అనుచరులు కూడా టీడీపీలోకి చేరనున్నారు.