చంద్రబాబు చెప్పారు..జగన్ చేతల్లో చూపారు: తిత్లి బాధిత రైతులకు రెట్టింపు పరిహారం
అమరావతి: రాష్ట్రానికి ఎప్పుడు తుఫాన్లు సంభవించినా.. మొట్టమొదటగా వాటి బారిన పడేది ఉత్తరాంధ్ర ప్రాంతమే. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడటమంటూ జరిగితే.. ఉత్తరాంధ్ర ప్రజల గుండె గుభేల్ మంటుంది. ప్రత్యేకించి అక్కడి రైతాంగం. వ్యవసాయం, చేపల వేటే ప్రధాన వృత్తిగా కొనసాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు తుఫాన్ల దెబ్బకు కుదేలైన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయాల్లో ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర రైతులపై వరాల జల్లు కురిపిస్తుంటారు. అవి వాస్తవ రూపం దాల్చిన ఘటనలు పరిమితంగానే కనిపిస్తుంటాయి. తాజాగా- తిత్లి తుఫాను బారిన పడి సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిత్లి తుఫానులో దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారాన్ని రెట్టింపు చేసి ఇస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన హామీని అమలు చేశారు. చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇదే హామీని ఇచ్చినప్పటికీ.. అది అరకొరగానేనని అంటున్నారు విశ్లేషకులు.
టిక్ టాక్ సైడ్ ఎఫెక్ట్స్: వీడియో కోసం నడిరోడ్డులో జీపును తగులబెట్టిన ప్రబుద్ధుడు
సాధారణంగా తుఫాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో దెబ్బతినే ఉద్యానవన పంటలకు పరిహారాన్ని చెల్లించడానికి ఓ బెంచ్ మార్క్ మొత్తాన్ని రూపొందించాయి గత ప్రభుత్వాలు. పూలు, పండ్లు, కొబ్బరి వంటి ఉద్యానవన పంటలకు ఒక్కో రకానికి ఒక్కో రేటును నిర్ధారించాయి. తుఫాన్ల ధాటికి నేలకు ఒరిగిన ఒక్కో కొబ్బరి చెట్టుకు వెయ్యి రూపాయలు, శ్రీకాకుళం జిల్లాలో మరో ప్రధానమైన జీడి పంటలకు ఒక్కో హెక్టారుకు 20 వేల రూపాయలను నష్ట పరిహారాన్ని ఇస్తుండేవి. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో తిత్లి తుఫాను మిగిల్చిన విధ్వంసాన్ని, సంభవించిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది ఈ పరిహారం మొత్తాన్ని సవరించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఒక్కో కొబ్బరి చెట్టుకు 1500 రూపాయలు, ఒక్కో హెక్టారు జీడిపంటకు 30 వేల రూపాయల పరిహారాన్ని ఇస్తామని ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే.. ఉద్యానవన పంటలకు ప్రభుత్వం చెల్లిస్తోన్న నష్ట పరిహారం మొత్తాన్ని పెంచుతామని ఎన్నికల ప్రచారం సమయంలో హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన మూడునెలల వ్యవధిలనే ఈ మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నేలకూలిన ఒక్కో కొబ్బరి చెట్టుకు 1500 రూపాయలకు బదులుగా 3000 రూపాయలను పరిహారంగా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న జీడిపంట హెక్టారు ఒక్కింటికి 30 వేల రూపాయల మొత్తాన్ని 50 వేల రూపాయలకు పెంచారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏ పంటకు ఎంత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తారనే విషయాన్ని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.