చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు: మహేష్బాబు ఫ్యాన్స్ను టీడీపీ వైపు లాగుతున్నారా అంటే...
అమరావతి: సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గురు వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పారదర్శకతలేని కారణంగా, ఆ పార్టీ విధానాలు నచ్చకే పదిహేను రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశానని ఆదిశేషగిరి రావు తెలిపారు. ఏం చేయాలనే విషయం త్వరలో ప్రకటిస్తానని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలో నిర్ణయం తీసుకొని, చెబుతానని అన్నారు. తాను వైసీపీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.
చంద్రబాబుకు రాహుల్ గాంధీ షాక్: పొత్తుపై తేల్చేసిన కాంగ్రెస్, ప్రియాంక గాంధీ ఎంట్రీతో...
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశా
ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశానని ఆదిశేషగిరి రావు తెలిపారు. ముఖ్యంగా ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు విషయంలో ఆయన చేయూతనిస్తున్నారని చెప్పారు. అందుకే ఆయనను అభినందించేందుకు వచ్చానని చెప్పారు.
రాజకీయాలు చర్చించా
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు పలు రాజకీయ అంశాలు కూడా చర్చించానని ఆదిశేషగిరి రావు అన్నారు. తన శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులతో చర్చించి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు సాన్నిహిత్యం ఉందని, అదే జగన్తో కొనసాగిందని, కానీ ఆ పార్టీ విధివిధానాలు నచ్చలేదని చెప్పారు.
టీడీపీ ఏ హామీలేదు
తనకు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని ఆదిశేషగిరి రావు చెప్పారు. తాను ఇంకా టీడీపీలో చేరలేదని, చేరితే కనుక మీకు చెబుతానని అన్నారు. ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబును అభినందించేందుకే కలిశానని చెప్పారు. చంద్రబాబు పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ను టీడీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా?
మహేష్ బాబు అభిమానులను కూడా సమావేశమై, అందరినీ టీడీపీ వైపు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మా అభిమానులను మేం ఎప్పుడూ కలుస్తామని, ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటామని ఆదిశేషగిరి రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలతో, బంధువులతో, తన అన్న (కృష్ణ)తో చర్చించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వారం పది రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు. నేను ఏ పని చేసినా తన సోదరుడు సూపర్ స్టార్ కృష్ణ మద్దతు లేకుండా చేయనని చెప్పారు. ఆయనను సంప్రదించకుండా నేను ఏ నిర్ణయం తీసుకోనని చెప్పారు.