నందిపై రచ్చ సహజమే, పోసానిది అనవసర రాద్ధంతం, చంద్రబాబు గాలికొదిలేశారు: ఆదిశేషగిరిరావు
అవార్డుల్లో కులాలేంటి? ఈ ఆరోపణలేంటి? ఈ విషయంలో పోసాని కృష్ణమురళి అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ నంది అవార్డుల వివాదంపై వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు స్పందించారు.
విజయవాడ: అవార్డుల్లో కులాలేంటి? ఈ ఆరోపణలేంటి? ఈ విషయంలో పోసాని కృష్ణమురళి అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ నంది అవార్డుల వివాదంపై వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు స్పందించారు.
అవార్డులు రానివారు రచ్చ చేయడం సహజమేనన్నారు. ఒకసారి అవార్డులను ప్రకటించాక వాటిని వెనక్కి తీసుకోవడమనేది ఉండదని అన్నారు. అవార్డులు రద్దు చేయాలంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు.
తాను నంది అవార్డును స్వీకరిస్తే 'కమ్మ కులపోడివి కాబట్టే నీకు అవార్డు వచ్చింది అంటారని... అందుకే అవార్డును తిరస్కరిస్తున్నా..'నని పోసాని అన్న విషయం తెలిసిందే.
అంతేకాదు, ఏపీలో ఆధార్, ఓటర్ ఐడీ లేని వారు మాట్లాడుతున్నారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా పోసాని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు స్పందించారు.
చంద్రబాబుపైనా ధ్వజం...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా ఘట్టమనేని ఆదిశేషగిరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈవెంట్ మేనేజ్మెంట్లతో కాలం గడుపుతోందని అన్నారు.
బుధవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా, గోదావరి డెల్టాలు పూర్తిగా ఎండిపోయాయని, వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి పనికి ప్రతిపక్షం అడ్డుపడుతుందంటూ నెపం వైసీపీపై నెడుతున్నారన్నారు.
టీడీపీ లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం విడిపోయేది కాదని ఆదిశేషగిరిరావు అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీని ఎందుకు ఉపయోగించుకోకూడదు? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత మిగులు విద్యుత్ ఉన్నా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని ఆదిశేషగిరిరావు ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ నేతలు సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ తన గొప్పేనని గతంలో చంద్రబాబు సైతం చెప్పారని, ఇప్పుడు బీజేపీపై నెపం మోపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారన్నారు. ఏపీ డీజీపీ నియామకంలో కూడా జాప్యమెందుకు అని ఆయన ప్రశ్నించారు.