జగన్ సవాల్కు వెనుకంజ: అవిశ్వాసంపై ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్య, మోడీపై మళ్లీ
Recommended Video
కడప: కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అవిశ్వాస తీర్మానం పెడతామని, టీడీపీ తమతో కలిసి వస్తుందా అన్న వైసీపీ అధినేత జగన్కు కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రయోజనాల విషయంలో టీడీపీ తగ్గే ప్రసక్తి లేదని, తాము కేంద్రానికి డెడ్ లైన్ విధించామన్నారు.
ఆ తర్వాత తాడోపేడో తేల్చుకుంటామని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ తర్వాత కూడా ఆదినారాయణ తమ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని చెప్పి, ఆ తర్వాత నాలుక కర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రకటన చేశారు.
బాబుకు రివర్స్: బీజేపీ మంత్రుల రాజీనామా? మిస్టర్ సీఎం.. విష్ణు సంచలనం, గల్లాకు కౌంటర్
జగన్ ఆ విషయం మరిచిపోయారా
కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. అసలు వైసీపీ అధినేతకు అవిశ్వాసం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలనే విషయం జగన్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. మిత్రపక్షంగా ఉండి అవిశ్వాసం ఎలా పెడుతుందని ప్రశ్నించారు.
లేదంటే కేంద్రానికి జనగణమన
ప్రజల పక్షాన తాము కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తున్నామని, చేస్తామని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రయోజనాల విషయంలో తగ్గే ప్రసక్తి లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రానికి మార్చి 5వ తేదీన డెడ్ లైన్ విధించామని చెప్పారు. ఆ తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కేంద్రానికి జనగణమన పాడుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ సవాల్కు టీడీపీ వెనుకంజ
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చుగా అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ అధినేత జగన్ సానుకూలంగా స్పందించారు. అయితే ఆదినారాయణ వ్యాఖ్యలను బట్టి టీడీపీ మాత్రం సానుకూలంగా లేదని అర్థమవుతోంది. తాము మిత్రపక్షం కాబట్టి అవిశ్వాసం పెట్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా ఓ కల
ఆదినారాయణ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. తాము (టీడీపీ) నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుట 19 డిమాండ్లు పెట్టామని చెప్పారు. వాటిని తాము ఇచ్చిన డెడ్ లైన్ లోగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఓ కల అని, దాని గురించి పోరాడటం వృథా అని స్పష్టం చేశారు.
నిన్న జేసీ, నేడు ఆదినారాయణ రెడ్డి
ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలుమార్లు ఏపీకి హోదా రాదని, కేవలం ప్యాకేజీ మాత్రమే వస్తుందని చెప్పారు. ఆదినారాయణ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.