సీఎం వర్సెస్ ఆది: ఆధిపత్య పోరు, బాబు దూరంతో తీసికట్టుగా రమేష్ పరిస్థితి!
కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అంతా తానై నడిపించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్కు జిల్లాకే చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి నుంచి సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
కడప: జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అంతా తానై నడిపించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్కు జిల్లాకే చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి నుంచి సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తాను చెప్పిందే వేదం అన్నట్లు సాగుతుండగా.. సీఎంకు.. మంత్రి ఆది అందుకు అడ్డుకట్ట వేస్తున్నట్లు సమాచారం.
సీఎంకు చెక్ పెడుతున్నారా?
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబునాయుడుకు సన్నిహితుడిగా అన్ని వ్యవహారాల్లో తలదూర్చే సీఎం రమేష్కు, మంత్రి హోదాలో ఉన్న ఆది నారాయణ రెడ్డికి మధ్య తీవ్ర ఆదిపత్య పోరుసాగుతోంది. సీఎం రమేష్ తీరుతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా విసిగిపోయినట్లు తెలుస్తోంది. పార్టీకి ఏ విధంగా సహాయపడని వ్యక్తి.. అన్ని వ్యాపారాలు తనకే కావాలని అంటున్నారని జిల్లా టీడీపీ నేతలు సీఎం రమేష్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అన్నితానైన రమేష్
కాగా, గతంలో చంద్రబాబుకు సీఎం రమేష్కు మంచి అనుబంధమే ఉండేది. అయితే ఇప్పడది తగ్గిపోయింది. పార్టీలో ఆయన ప్రాభల్యం కోల్పోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పార్టీకి అన్నీ చేసిన ఆయన్ను పార్టీ పక్కన పెట్టేసిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. గత కొంత కాలం క్రితం కడప జిల్లాకే చెందిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రమేష్ ప్రాభల్యాన్ని తగ్గిందని చెబుతున్నారు.
ఎమ్మెల్యే రంగంలోకి..
రానున్న ఎన్నికల్లో సీఎం రమేష్, ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రొద్దుటూరు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో దిగాలని చూస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముఖ్యమంత్రికి సైతం చెప్పకుండా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును ప్రొద్దుటూరుకు పిలిపించి రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇప్పించారని టీడీపీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి.
సీఎంకు ఫిర్యాదు..
అయితే ఇప్పటికే అక్కడ మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుతం తెలుగుదేశంలో కొనసాగుతున్న వరదరాజుల రెడ్డి ఎన్నో రోజులుగా ఆస్థానం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. అంతేగాక ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు గొడవలకు దిగాయి.
సీఎంపై ఎన్నో ఆరోపణలు..
ఇది ఇలా వుంటే.. గతంలో రమేష్.. పార్టీలోని ఇతర నాయకులకు ప్రాజెక్టులు దక్కకుండా అణతొక్కారనే అపవాదులు కూడా ఉన్నాయి. దీంతో బెంబేలెత్తిన నాయకులు, వరదరాజల రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సీఎం రమేష్ ను కొంత దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.
సీఎం దూరం పెట్టడంతో..
ఈ క్రమంలోనే పార్టీ అధినేతను కలవాలన్నా అపాయింట్మెంట్ దొరకడం లేదని సమాచారం. అంతేకాదు జిల్లా పార్టీ పగ్గాలను సైతం మంత్రి ఆదికే అప్పగించారు. జిల్లాలో ఏం జరగాలన్నా వయా మంత్రిగారి ద్వారానే జరగాలని ఆదేశించారు. దీనిపై సీఎం రమేష్ కూడా పైకి సరే అన్నా.. సన్నిహితులు దగ్గర మాత్రం తన పరిస్థతి ఏమాత్రం బాగాలేదని, ముఖ్యమంత్రి పట్టించుకోవడం మానేశారని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తీసికట్టుగా సీఎం పరిస్థితి?
అంతకు ముందు వరకూ జిల్లాలో ఏకాంట్రాక్టులు జరిగినా రమేష్ చేయి పడాల్సిందేననే ప్రచారం ఉండేది. కానీ, ఇప్పడు మాత్రం ఏం కావాలన్నా మంత్రి ఆది దగ్గరకే తెలుగుతమ్ముళ్లు క్యూ కడుతున్నారట. పార్టీకి ఎంతో చేసిన తనను కాదని ఆదినారాయణ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తుండంతో పార్టీ అధినేతతో పాటు, మంత్రి ఆదినారాయణపై సీఎం రమేష్ అసహనంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రానున్న కాలంలో సీఎం రమేష్ పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోందోనని ఆయ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.